అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి లంచం అడిగిన ఓ అధికారిని ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. రూ.30 వేల లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి (Rangareddy) జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్లోని హిమాయత్ సాగర్ (Himayat Sagar) సెక్షన్లో అమర్ సింగ్ సహాయక ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఏఆర్సీకే ప్రాజెక్ట్స్ అపార్ట్మెంట్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి ఏఈ రూ.30 వేల లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం లంచం తీసుకుంటుండగా.. ఏఈ అమర్ సింగ్ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన కార్యాలయంలో సోదాలు చేపట్టారు.
ACB Raid | మారని అధికారులు
ఇటీవల నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా వంగూర్ మండలం మాచినోనిపల్లి లైన్మన్ తోట నాగేంద్ర సైతం ఏసీబీకి చిక్కారు. ఓ వ్యక్తి వ్యవసాయ భూమిలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి ఆయన రూ.15 వేల లంచం అడిగాడు. దీంతో ఏసీబీ అధికారులు లైన్మన్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇలా నిత్యం లంచాలు తీసుకుంటూ అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారు. అయినా అవినీతి అధికారులు మారడం లేదు. కొందరు లంచం తీసుకోవడం కూడా తమ హక్కుగా భావిస్తున్నారు.
ACB Raid | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.