Homeజిల్లాలునిజామాబాద్​MLA PA | ఎమ్మెల్యే పీఏపై చర్యలు.. షోకాజ్ నోటీసులు జారీ చేసిన డీఈవో

MLA PA | ఎమ్మెల్యే పీఏపై చర్యలు.. షోకాజ్ నోటీసులు జారీ చేసిన డీఈవో

విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఉపాధ్యాయుడు ప్రజాప్రతినిధి వద్ద పీఏగా పనిచేస్తున్న ఘటనపై నిజామాబాద్​ డీఈవో అశోక్​ ఎట్టకేలకు స్పందించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLA PA | విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఉపాధ్యాయుడు ప్రజాప్రతినిధి వద్ద పీఏగా పనిచేస్తున్న ఘటనపై నిజామాబాద్​ డీఈవో అశోక్​ (Nizamabad DEO Ashok) ఎట్టకేలకు స్పందించారు.

సదరు ఉపాధ్యాయుడు శ్రీనివాస్​ రెడ్డిపై (teacher Srinivas Reddy) చర్యలకు ఉపక్రమించారు. అనధికారికంగా సెలవులో ఉండడమే కాకుండా.. ఎమ్మెల్యే వద్ద పీఏగా పనిచేస్తున్న ఉదంతంపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. సత్వరమే వివరణ ఇవ్వాలని శ్రీనివాస్​ రెడ్డికి షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యే పీఏపై అతిత్వరలోనే శాఖాపరమైన చర్యలు ఉండవచ్చని తెలుస్తోంది. విద్యాహక్కు చట్టం (Education Act) నిబంధనల ప్రకారం.. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులకు పీఏలుగా విధులు నిర్వహించకూడదు.

ఈ విషయమై గతంలోనే సుప్రీంకోర్టు (Supreme Court) సైతం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో అన్ని రాష్ట్రాలు సైతం ఉపాధ్యాయులను పీఏలుగా నియమించడంపై నిషేధం విధించాయి. కానీ నిజామాబాద్​ జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. స్కూల్​ అసిస్టెంట్​ శ్రీనివాస్​ రెడ్డి (జీవోల శ్రీనివాస్​ రెడ్డి) నిజామాబాద్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి (MLA Bhupathi Reddy) పీఏగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఈయన పోస్టింగ్​ ధర్పల్లి మండలం మైలారం ఉన్నత పాఠశాల. కాగా.. రెండేళ్లుగా ఆయన బడికి మొహం చాటేశారు. సంబంధిత మండల ఎంఈవో వద్ద ప్రతి నాలుగు నెలలకోసారి సెలవులు పెట్టి.. ఎమ్మెల్యే వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఈ తంతు దాదాపు గత రెండేళ్లుగా కొనసాగుతోంది. పైపెచ్చు గతంలో జీతభత్యాలు కూడా జారీ చేయడం గమనార్హం.

MLA PA | ఎంఈవో అండదండలు

నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వద్ద పీఏగా కొనసాగడం వెనుక స్థానిక ఎంఈవో అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు సొంత నియోజకవర్గంలో శ్రీనివాస్​ రెడ్డి పనిచేసే పాఠశాల ఉండడంతో దాదాపు నెలల తరబడిగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఎమ్మెల్యేతో పలుమార్లు డీఈవో, ఎంఈవో (DEO and MEO) అధికారికంగా వేదికలు పంచుకున్న సమయంలో సదరు ఉపాధ్యాయుడు శ్రీనివాస్​ రెడ్డి అక్కడే ఉన్నా విద్యాశాఖ అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించారు. చివరకు ఓ వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్ (RTI petition)​, ‘అక్షరటుడే’లో ప్రచురితమైన కథనాల ఆధారంగా విద్యాశాఖ అధికారులు స్పందించారు.

MLA PA | సత్వరమే వివరణ ఇవ్వాలని ఆదేశం

శ్రీనివాస్​ రెడ్డిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో డీఈవో అశోక్​ విచారణ జరిపించారు. ఎంఈవోను రంగంలోకి దించి క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయించారు. కాగా.. ప్రతి నాలుగు నెలలకొకసారి శ్రీనివాస్​ రెడ్డి అకారణంగా సెలవు పెట్టి వెళ్తున్నట్లు గుర్తించారు. తిరిగి ఒకరోజు విధుల్లో చేరి మరుసటి రోజే మళ్లీ నాలుగు నెలలు సెలవు తీసుకుని గత రెండేళ్లుగా ఎమ్మెల్యే వద్ద పీఏగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.

ఈ విషయమై స్థానిక ఎంఈవో డీఈవోకు తుది నివేదిక అందించారు. 125 రోజులు అనధికారిక సెలవులో (unofficial leave) ఉండడమే కాకుండా ఎమ్మెల్యే వద్ద పీఏగా కొనసాగుతున్నట్లు నివేదికను సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన డీఈవో అశోక్​ ఎట్టకేలకు స్కూల్​ అసిస్టెంట్​, ఎమ్మెల్యే పీఏగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్​ రెడ్డికి షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. ఎలాంటి గడువు విధించకుండా సత్వరమే వివరణ ఇవ్వాలని నోటీసులో సూచించారు. వివరణ అనంతరం శ్రీనివాస్​ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు.

Must Read
Related News