అక్షరటుడే, కామారెడ్డి: Chain Snatching | ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో.. ఓ మహిళ మెడలో గొలుసు చోరీ చేసి వ్యాపారికి అమ్మిన నిందితుడు మృతి చెందగా.. కొనుగోలు చేసిన వ్యక్తికి కోర్టు శిక్ష విధించింది. కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2020 జులై 17న బిచ్కుందకు (Bichkunda) చెందిన ఈడెం పోచవ్వ తన ఇంటి నుంచి మధ్యాహ్నం సమయంలో మార్కెట్కు బయలుదేరింది.
బిచ్కుందలోని మెయిన్ రోడ్డులో ఓ దుండగుడు మీకు పింఛన్ డబ్బులు (pension money) వచ్చాయి. బ్యాంకు అకౌంట్లో పడ్డాయని మాయమాటలు చెప్పి పక్కనున్న సందులోకి తీసుకెళ్లి ఆమె మెడలోని తులం బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి కుమారుడు బిచ్కుంద పోలీస్ స్టేషన్లో (Bichkunda police station) ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన వాగ్మారే దిగంబర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు.
చోరీ చేసిన బంగారు గొలుసును (gold chain) పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన సుబ్బుర్ వార్ తుకారాంనకు అమ్మినట్లు తెలిపాడు. దాంతో తుకారంను కూడా అరెస్ట్ చేశారు. కేసులో సాక్షాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రధాన నిందితుడు దిగంబర్ మృతి చెందడంతో.. దొంగ సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి తుకారాంనకు బిచ్కుంద జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వినీల్ కుమార్ ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 3వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.