అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | ఏసీబీ దూకుడు పెంచింది. ఇటీవల వరుస దాడులతో అవినీతి అధికారుల పని పడుతోంది. తాజాగా ఒకే రోజు 12 ఆర్టీఏ చెక్పోస్టులపై ( RTA check posts) దాడులు చేపట్టింది.
రాష్ట్రంలోని పలు ఆర్టీఏ చెక్పోస్టుల్లో శనివారం అర్ధరాత్రి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. చెక్ పోస్ట్లలోని ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ వ్యక్తులను నియమించడం ద్వారా లారీ డ్రైవర్లు (Lorry Drivers) నుంచి అక్రమ డబ్బు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బును ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉంచుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) చెక్ పోస్ట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ACB Raids | తనిఖీలు జరిగింది ఇక్కడే..
నల్గొండ జిల్లా విష్ణుపురం, సూర్యాపేట జిల్లా కోదాడ, నారాయణపేట జిల్లా కృష్ణ చెక్ పోస్ట్, ఆదిలాబాద్ జిల్లా బోరజ్, నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, కామారెడ్డి జిల్లా (Kamareddy District) పొందుర్తి, సలబత్పూర్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, కొత్తగూడెం జిల్లా పాల్వంచ, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా ముత్తుగూడెం చెక్పోస్టుల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ACB Raids | ఏజెంట్ల ద్వారా వసూళ్లు
ఆర్టీఏ చెక్పాయింట్ (RTA Check Point) వద్ద అధికారులు తమ వాహనాలను అడ్డగించకుండా.. డ్రైవర్లు క్రమం తప్పకుండా నగదు చెల్లింపులు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇది చాలా కాలంగా వ్యవస్థీకృత దోపిడీ వ్యవస్థ ఉనికిని సూచిస్తుందని పేర్కొన్నారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా తమ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఏజెంట్లు వాహనాలను ఆపడానికి, డ్రైవర్లు, వాహన యజమానుల నుంచి అక్రమ చెల్లింపులు వసూలు చేయడానికి అనుమతిస్తున్నారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులపై అవసరమైన చర్యలను సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.4,18,880 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.