అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | మరో అవినీతి అధికారి ఏసీబీ (ACB)కి చిక్కాడు. ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించుకున్న పశువుల షెడ్ బిల్లుల కోసం ఓ అధికారి రూ.10 వేల లంచం డిమాండ్ చేశాడు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS)లో భాగంగా ప్రభుత్వం పశువుల షెడ్లు నిర్మించుకోవడానికి అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. మొదట షెడ్డు నిర్మించుకొని దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తోంది. అయితే బిల్లులు ప్రాసెస్ చేయడానికి టెక్నికల్ అసిస్టెంట్ డబ్బులు డిమాండ్ చేశారు. అతడిని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
మంచిర్యాల (Mancherial) జిల్లా కన్నెపల్లి ఎంపీడీవో (MPDO) కార్యాలయంలో పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి విభాగంలో బానోత్ దుర్గా ప్రసాద్ టెక్నికల్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. మండల పరిధిలోని ఓ వ్యక్తి ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించుకున్న షెడ్డుకు బిల్లులు మంజూరు చేయాలని ఆయనను కలిశాడు. షెడ్డు కొలతలు తీసి, ఎం బుక్లో నమోదు చేయడానికి, పెండింగ్ బిల్లును మంజూరు చేయడానికి ఆయన రూ.10 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శనివారం టెక్నికల్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
కాగా ఏసీబీ అధికారులు ఇటీవల దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ అవినీతి అధికారులను అరెస్ట్ చేస్తున్నారు. శనివారం రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటుండగా.. మేడ్చల్ (Medchal) జిల్లా ఎల్లంపేట మున్సిపల్ ఆఫీస్ టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డిని ఏసీబీ పట్టుకుంది. శుక్రవారం సైతం మణుగూరు ఎస్సై (Manuguru SI) పై కేసు నమోదు చేసింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి డివిజన్ జూనియర్ లైన్మన్ను వల పన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.