అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Case | అవినీతి అధికారులు మారడం లేదు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు.
తాజాగా లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్(RI), మండల సర్వేయర్ (Surveyor)పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వనపర్తి (Vanaparthi) జిల్లా కొత్తకోట మండలం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా సి.వాసు, సర్వేయర్గా జి.నవీన్ రెడ్డి పని చేస్తున్నారు. మండలానికి చెందిన ఓ వ్యక్తి భూమి విచారణ కోసం వారిని సంప్రదించారు. భూమికి సంబంధించి విచారణ నిర్వహించి, పంచనామా నివేదికను ఓఆర్సీ (ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్) జారీ చేయడం కోసం వారు రూ.40 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడి బంధువు ఏసీబీ (ACB) అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆర్ఐ వాసు, సర్వేయర్ నవీన్రెడ్డిపై ఏసీబీ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు.
ACB Case | రైతులను పీడిస్తున్నారు
రాష్ట్రంలోని పలు తహశీల్దార్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే రైతులను అధికారులు లంచాల పేరిట పీడిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. అటెండర్ నుంచి మొదలు పెడితే తహశీల్దార్ వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు.
ACB Case | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.