అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. లంచం ఇస్తేనే పనులు చేస్తున్నారు. తాజాగా ఇద్దరు అధికారులు, ఓ ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏసీబీ దాడులు (ACB Raids) చేపడుతున్నా అవినీతి అధికారులు మారడం లేదు. ప్రైవేట్ వ్యక్తుల సాయంతో యథేచ్ఛగా లంచాలు వసూలు చేస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. ఓ వ్యక్తికి సంబంధించిన ఫార్మసి వార్షిక తనిఖీ నిర్వహించినందుకు కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని డ్రగ్స్ నియంత్రణ పరిపాలన కార్యాలయంలోని సహాయ సంచాలకుడు మర్యాల శ్రీనివాసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ్ రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం లంచం తీసుకుంటుండగా.. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తీక్తో పాటు ప్రైవేట్ వ్యక్తి పుల్లూరి రామును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ACB Trap | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.