అక్షరటుడే, ఇందూరు: Abul Kalam Azad | దేశ విద్యావ్యవస్థను తీర్చిదిద్దిన మహనీయుడు భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ (Minority Welfare Department) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో అబుల్ కలాం ఆజాద్ జయంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అబుల్ కలాం 11 ఏళ్లపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎనలేని సేవలు అందించి, జాతీయ విద్యా విధానాన్ని గాడిలో పెట్టారన్నారు. రచయితగా, తత్వవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయ నేతగా అనేక సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు.
ఆయన మైనారిటీ వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అబుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ప్రతిఏడాది నవంబర్ 11న ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
