అక్షరటుడే, వెబ్డెస్క్ : CBSE Syllabus | నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి తండాకు చెందిన యువకుడి కవిత సీబీఎస్ఈ పాఠ్యాంశం అయింది. జక్రాన్పల్లి తండాకు (Jakranpally Thanda) చెందిన రమేశ్ కార్తీక్ నాయక్ తన కవితలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రాసిన ఢావ్లో – గోర్ బంజారా కథలకు 2024 కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది.
రమేశ్ చిన్ననాటి నుంచి కవితలు రాసేవాడు. గోర్ బంజరా తెగకు చెందిన ఆయన తన మాతృ భాషతో పాటు, తెలుగు, ఇంగ్లిష్లో ఎన్నో రచనలు చేశారు. ‘చక్మక్’ (చెకుముకి రాయి) పేరిట ఆయన ఆంగ్లంలో కవితా సంపుటి వెలువరించారు. ఇందులోని ‘ది రోస్ ల్యాండ్’ (The Rose Land) కవితను సీబీఎస్ఈ బోర్డు ఈ ఏడాది ఎనిమిదో తరగతి ఇంగ్లిష్ సిలబస్లో (8th Class English syllabus) పాఠ్యాంశంగా చేర్చింది. కాగా ఈ కవిత బంజారా తెగకు చెందిన తల్లీకొడుకుల జీవన ప్రయాణాన్ని తెలుపుతుంది.
CBSE Syllabus | ప్రకృతితో అనుబంధం
రమేశ్ కార్తీక్ నాయక్ ప్రకృతి, బంజారా జీవన విధానంపై ఎక్కువగా కవితలు రాస్తారు. ప్రస్తుతం పాఠ్యాంశంగా చేర్చిన కవిత సైతం ఓ తల్లి మాట వినకుండా ఆమె కుమారుడు సాగించే ప్రయాణాన్ని తెలుపుతోంది. ప్రకృతి ఒడిలో బాలుడి ప్రయాణం, బాల్యంలో చుట్టుముట్టే భయాలు, ఊహా లోకపు మాయలు వివరిస్తుంది. బంజారా తెగ సంస్కృతి (Banjara Tribe Culture), సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉన్న ఈ కవితను పాఠ్యాంశంగా చేరుస్తూ సీబీఎస్ఈ (CBSE) నిర్ణయం తీసుకుంది.
CBSE Syllabus | ఎన్నో అవార్డులు
నిజామాబాద్ జిల్లాకు (Nizamabad District) చెందిన యువకవి రమేశ్ కార్తీక్ నాయక్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఢావ్లో – గోర్ బంజారా కథల సంపుటికి ఏకంగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఆయన పదో తరగతి నుంచి కవితలు రాస్తున్నారు. ఆయన రాసిన బల్దేర్ బండి కవిత ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంఏ పాఠ్యాంశంగా చేర్చారు. అలాగే ఆంగ్లంలో రాసిన లైఫ్ ఆన్ పేపర్ కవితను కర్ణాటకలోని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పీజీ మొదటి సెమిస్టర్ ఇంగ్లిష్ పాఠ్యాంశంగా చేర్చింది.