అక్షరటుడే, వెబ్డెస్క్ : Nagar Kurnool | వారిద్దరు రాంగ్ నంబర్లో కనెక్ట్ అయ్యారు. అనంతరం ప్రేమించి వివాహం (Love Marriage) చేసుకున్నారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే భార్యపై అనుమానంతో భర్త ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి తగుటబెట్టాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లాలో చోటు చేసుకుంది.
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలంకి రాంగ్ నెంబర్ ద్వారా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోటూర్కు చెందిన శ్రావణి (27) పరిచయం అయింది. వీరు తరచూ ఫోన్లు చేసుకోవడంతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో 2014లో వీరు పెళ్లిచేసుకున్నారు. ఈ దంపతులకు ఒక పాప, ఒక బాబు జన్మించారు.
Nagar Kurnool | భర్తను వదిలేసి ఒంటరిగా..
పెళ్లయిన కొన్నాళ్లకు శ్రీశైలం, శ్రావణి మధ్య గొడవలు మొదలు అయ్యాయి. శ్రీశైలం అనుమానంతో భార్యను వేధించేవాడు. దీంతో అతడిపై కేసు పెట్టిన శ్రావణి కొంతకాలంగా ఒంటరిగా ఉంటుంది. అయితే ఏడాది క్రితం మళ్లీ ఆమె భర్త దగ్గరకు వచ్చింది. కాగా ఒంటరిగా ఉన్న సమయంలో శ్రావణి తన అక్క భర్తతో వెళ్లిపోయినట్లు సమాచారం. శ్రావణి ప్రైవేట్ జాబ్ చేస్తుండగా.. శ్రీశైలం దినసరి కూలీగా పనిచేస్తున్నాడు.
Nagar Kurnool | ఫోన్ మాట్లాడుతోందని..
భర్త దగ్గరికి తిరిగి వచ్చిన శ్రావణి ఇతరులతో ఫోన్ మాట్లాడుతోందని, చాటింగ్ చేస్తోందని శ్రీశైలం నిత్యం గొడవ పడేవాడు. పద్ధతి మార్చుకోమని చెప్పినా ఆమె వినకపోవడంతో హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో ఈ నెల 21న సోమశిలకు వెళదామని భార్యను బైక్పై తీసుకెళ్లాడు. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ సమీపంలో అటవీ ప్రాంతంలోకి తీసుకు వెళ్లి ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు.
తన కూతురు కనిపించడం లేదని శ్రావణి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే తన భార్యను తానే చంపినట్లు శ్రీశైలం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.