అక్షరటుడే, భీమ్గల్ : Bheemgal | అమ్మంటే ప్రేమకు ప్రతిరూపం అంటారు. కానీ ఇటీవల కొందరు తల్లులు మాతృమూర్తి పదానికే కళంకం తీసుకొస్తున్నారు. తాగుడుకు బానిసగా మారి తమ ఎంజాయ్మెంట్కు అడ్డు వస్తున్నారనో, వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారనో పేగు తెంచుకు పుట్టిన బిడ్డలను కడతేరుస్తున్నారు. కడుపున పెట్టుకు కాపాడాల్సిన వారే తుదముట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా నిజామాబాద్ జిల్లా(Nizamabad district) భీమ్గల్ మండలంలో చోటుచేసుకుంది.
భీమ్గల్ మండలం గోనుగొప్పుల గ్రామంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. స్థానిక ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వంజరి మల్లేష్, శిరసు రమ్య భార్యాభర్తలు. వీరికి ఐదు నెలల కూతురు ఉంది. అన్నీ తానై చూసుకునే భర్త, ముద్దులొలికే చిన్నారి కూతురు, పండంటి కాపురంతో ఆ తల్లి సంతృప్తి చెందలేదు. తాగుడుకు బానిసగా మారింది.
Bheemgal | తాగుడుకు బానిసగా మారి..
మద్యం మత్తులో ఒడిలోని బిడ్డను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది ఆ తాగుబోతు తల్లి. దీంతో పచ్చని సంసారంలో కలతలు మొదలయ్యాయి. అయితే, తన కూతురు వల్లనే దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని భావించిన రమ్య తన కడుపున పుట్టిన పసికందుపై పగ పెంచుకుంది. ఆదివారం (జులై 6) రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముక్కు పచ్చలారని చిన్నారిని అంతమొందించింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
రమ్య గత కొంతకాలంగా తాగుడుకు బానిసై కూతురుని పట్టించుకోలేదని ఆమె భర్త మల్లేష్ తెలిపారు. ఈ క్రమంలోనే తనకు అడ్డుగా ఉందని కూతురిని చంపినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Bheemgal | ఆందోళన కలిగిస్తున్న ఘటనలు..
మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. కుటుంబ కలహాలు, పెద్దల స్వార్థ ప్రయోజనాలకు పిల్లలు బలి అవుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబ బాంధవ్యాలను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి.