అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ముఠా నాయకుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
పాలేరులో జరిగిన సభలో సీఎం (CM Revanth Reddy) మాట్లాడుతూ.. గ్రామాల్లో బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం గానే కాదు.. హోంమంత్రిగా కూడా ఉన్న రేవంత్రెడ్డి సోయి లేకుండా బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలని ఎలా అంటారని ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను మరిచి, అసాంఘిక చర్యలను, నేరాలను ప్రోత్సహించేలా మాట్లాడటం సరికాదన్నారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో పదేళ్లపాటు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో నేడు అరాచక పర్వానికి ద్వారాలు తెరిచే వారు రాజ్యమేలడం రాష్ట్రానికి పట్టిన దరిద్రమన్నారు.
KTR | సీఎం మైండ్ బ్లాక్ అయింది
తెలంగాణ ప్రజల గుండెలనిండా గులాబీజెండాపై అభిమానాన్ని చూసి ముఖ్యమంత్రి మైండ్ బ్లాక్ అయిందని కేటీఆర్ అన్నారు. రెండేళ్లలోనే అట్టర్ ఫ్లాప్ పాలనతో పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్రెడ్డికి మతి భ్రమించిందని నేటి సభ సాక్షిగా తేలిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే కేసులు పెట్టి, అరెస్టులు చేసే పోలీసుశాఖ, ఇవాళ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
KTR | పాతబాసు ఆదేశాలతోనే..
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ పాట పాడటం వెనక ఉన్న కుట్ర ప్రజలకు అర్థమైందని కేటీఆర్ పేర్కొన్నారు. రెండేళ్లుగా పాతబాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టంచేసేలా సీఎం జలహక్కులను కాలరాశారని ఆరోపించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని స్పష్టమవడంతోనే దాని నుంచి ఏ క్షణానైనా బయటకు దూకేందుకు సీఎం రంగం సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొలేక ఓవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే నీ పన్నాగాలు చేస్తున్నారని ఆరోపించారు.