అక్షరటుడే, ఆర్మూర్: Double Bedroom Houses | ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి (Bodhan MLA Sudarshan Reddy) పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు.
92 మంది అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. ఆదర్శ గ్రామం అంకాపూర్ (Ankapur) నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆధునిక వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్న అంకాపూర్ గ్రామ రైతులు, మరింత ప్రగతి సాధించేలా చొరవ చూపాలన్నారు.
అధిక దిగుబడి, నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేలా ఈ ప్రాంత రైతాంగానికి ప్రభుత్వ పరంగా అవసరమైన తోడ్పాటును అందించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. జిల్లా రైతులు కూడా సాంప్రదాయంగా వస్తున్న వరి సాగుకే పరిమితం కాకుండా, పంట మార్పిడి పద్ధతులను పాటించాలని సూచించారు. నూతన వంగడాల దిశగా దృష్టిని కేంద్రీకరిస్తూ అంకాపూర్నకు మరింత వన్నె తేవాలని ఆకాంక్షించారు.
Double Bedroom Houses | రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి..
అంకాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. తన స్వగ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల (double bedroom houses) పంపిణీ కోసం ప్రత్యేక చొరవ చూపడం జరిగిందన్నారు. అర్హులైన మిగతా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారికి కూడా తప్పనిసరిగా మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని చెప్పారు.
Double bedroom houses | అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు..
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి (Collector T. Vinay Krishna Reddy) మాట్లాడుతూ.. జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అంకాపూర్ తరహాలోనే జిల్లాలోని మిగిలిన అన్ని సెగ్మెంట్లలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. వీటి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు అక్కడక్కడా వివిధ దశలలో నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను కూడా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.
పెండింగ్ నిర్మాణ పనులను లబ్ధిదారుల ఆధ్వర్యంలోనే పూర్తి చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ, అందుకు అయ్యే వ్యయాన్ని నేరుగా లబ్ధిదారులకే అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఆయా నిర్మాణ దశలను అనుసరిస్తూ వెనువెంటనే బిల్లులను చెల్లిస్తున్నామని తెలిపారు. వారం రోజుల వ్యవధిలోనే లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయని గుర్తు చేశారు.
ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ సందర్భంగా అంకాపూర్ గ్రామంలో (Ankapur village) బీటీ రోడ్డు నిర్మాణం పనులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ రమేశ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, హౌసింగ్ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పవన్ కుమార్, డీఈ నివర్తి, ఆర్మూర్ ఎంపీడీవో శివాజీ, తహశీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.