అక్షరటుడే, వెబ్డెస్క్ : Karun Nair | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును గురువారం ప్రకటించింది. ఈ సిరీస్కు యువ ఆటగాడు శుభ్మన్ గిల్(Shubhman Gill) కెప్టెన్గా ఎంపిక కాగా, రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపడుతున్నాడు.
అయితే, జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్(Karun Nair) తన నిరాశను వ్యక్తం చేశాడు. ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటన కోసం ఎంపికైన నాయర్, నాలుగు టెస్టుల్లో 25.62 సగటుతో 205 పరుగులు చేసి, ఒక్క హాఫ్ సెంచరీ మినహా పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ నేపథ్యంతో సెలక్టర్లు అతడిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.
Karun Nair | కరుణ్ నాయర్ స్పందన
వెస్టిండీస్ సిరీస్(West Indies Series)కు ఎంపిక అవుతానని భావించాను. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియడం లేదు,” అని నాయర్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టులో హాఫ్ సెంచరీ చేశాను. ఆ మ్యాచ్ టీమిండియా గెలిచింది. జట్టు కోసం కంట్రిబ్యూట్ చేశాను. కానీ, ఇప్పుడు అవేవీ పరిగణనలోకి తీసుకోలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నిర్ణయంపై సెలక్టర్లే వివరణ ఇవ్వాలి అంటూ వ్యాఖ్యానించాడు. ఇక చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడుతూ, “ఇంగ్లాండ్ పర్యటనలో కరుణ్ నుంచి ఎక్కువే ఆశించాం. కానీ నాలుగు టెస్టుల్లో కేవలం ఒక్క ఇన్నింగ్స్లోనే రాణించాడు. మిగిలిన ఇన్నింగ్స్ల్లో విఫలమయ్యాడు. అందుకే దేవ్దత్ పడిక్కల్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలనుకున్నాం,” అని తెలిపారు.
ప్రతి ఆటగాడికి కనీసం 15-20 టెస్టులు ఆడే అవకాశం ఇవ్వాలని ఆశించాలి. కానీ, కొన్ని సందర్భాల్లో అలా జరగడం కష్టమే అని అగార్కర్ అన్నారు. కరుణ్ నాయర్కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ, BCCI యువ ఆటగాళ్లను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత జట్టు తన కొత్త నాయకత్వంతో వెస్టిండీస్ పర్యటనలో విజయాన్ని అందుకోవాలన్న ధ్యేయంతో బరిలోకి దిగబోతోంది.
భారత్ జట్టు (vs వెస్టిండీస్ టెస్టు సిరీస్) : శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ రెడ్డి, ఎన్.జగదీశన్(వికెట్ కీపర్), సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.