అక్షరటుడే, వెబ్డెస్క్ : YVS Chowdhury | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తన తల్లి యలమంచిలి రత్న కుమారి వయోభారంతో కన్నుమూయడంతో వైవీఎస్ చౌదరి(YVS Chowdhury) ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
YVS Chowdhury | ఎమోషనల్ పోస్ట్
ఈ క్రమంలో వైవీఎస్ చౌదరి సోషల్ మీడియాలో (Social Media) ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మన పెద్దలు కొంత మందిని చూసి ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికొస్తార్రా మీరు?’ అంటూ చదువుకోని వాళ్లని చూసి మందలిస్తూండేవారు. ఆ సామెతకి అచ్చు గుద్దినట్లు సరిపోయే స్త్రీశక్తే మా అమ్మ.. ‘యలమంచిలి రత్నకుమారి (Yalamanchili Ratnakumari)’ గారు.
కానీ.. ఒక లారీడ్రైవర్ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’ గారి నెలసరి సంపాదనతో.. తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యంతో పాటు.. సినిమాలు చూపించడం నుంచి దేవాలయ దర్శనాలు, సీజనల్ పిండివంటలు, నిలవ పచ్చళ్లు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్.. ఇత్యాది అవసరాలకు.. ఎటువంటి లోటు రాకుండా.. తన నోటి మీది లెక్కలతోనే బడ్జెట్ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మగారు.. వీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలి అనే తపనతో.. అన్నీ తానై మమ్మల్ని పెంచడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు..
అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన విధానాలతో మాలో కూడా ఆ స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మగారు.. అటువంటి మా అమ్మగారు (88 యేళ్లు) ఈ గురువారం, 25వ సెప్టెంబరు 2025, సాయంత్రం గం8.31ని.లకు.. ఈ భువి నుండి సెలవు తీసుకుని.. ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, మా అన్నగారిని కలవడానికి వెళ్లిపోయారు’ అని రాసుకొచ్చారు. వైవీఎస్ చౌదరి తల్లికి సంతాపంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.