అక్షరటుడే,ఇందూరు: Indiramma Housing Scheme | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులను హెచ్చరించారు. జక్రాన్పల్లి (jakranpally) మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీడీవో, ఎంపీవో, హౌసింగ్ ఏఈ, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
మండలంలోని గ్రామాల వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు వాటి పురోగతిని కార్యదర్శుల ద్వారా తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలలో వెనుకంజలో ఉన్న గ్రామ కార్యదర్శులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. ఈ తరహా వైఖరిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు.
మంజూరీ పొందిన వారందరూ తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ, క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దరఖాస్తుదారుల అర్హతను పరిశీలించి ఇళ్లను మంజూరు చేశామని కలెక్టర్ గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇంటి నిర్మాణ పనులు చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహించడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.
Indiramma Housing Scheme | దసరా పండుగ లోపు..
దసరా పండుగ లోపు అన్ని ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయా నిర్మాణ దశల ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లో బిల్లులు జమ చేస్తున్నామని గుర్తు చేశారు. ఇంటి నిర్మాణానికి సుముఖంగా లేని లబ్ధిదారుల నుంచి ఇదివరకే లిఖిత పూర్వకంగా లేఖలు తీసుకుని, వారి స్థానంలో అర్హులైన ఇతర లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతిఒక్కరూ ఇంటి నిర్మాణ పనులు చేపట్టేలా చూడాలని, ఇందిరమ్మ కమిటీల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
బిల్లుల చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు లబ్ధిదారుల వివరాలు ఆధార్ కార్డు వివరాలతో సరిపోలి ఉన్నాయా అన్నది పరిశీలించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఎవైనా తేడాలు ఉంటే ఆధార్ అప్డేషన్ చేయించాలని అన్నారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామ పంచాయతీ కార్యదర్శులు సాంకేతిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తేగా, అప్పటికప్పుడే కలెక్టర్ రాష్ట్ర హౌసింగ్ ప్రధాన కార్యాలయం అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యలను పరిష్కరింపజేశారు. దసరా పండుగ తరువాత తాను ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై మళ్లీ సమీక్ష నిర్వహిస్తానన్నారు. సమీక్షలో జక్రాన్పల్లి ఎంపీడీవో సతీశ్, ఎంపీవో యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.