అక్షరటుడే, వెబ్డెస్క్ : Encounter | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని నారాయణ్పూర్ (Narayanpur) జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు అగ్ర నేతలు హతమయ్యారు.
కూంబింగ్ చేపడుతున్న సమయంలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు రాజు దాదా అలియాస్ కట్టా రామచంద్రారెడ్డి, కోసా దాదా అలియాస్ కడారి సత్యనారాయణ రెడ్డి మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. వారి తలపై రూ.40 లక్షల చొప్పున రివార్డు ఉందని తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి AK-47 అస్సాల్ట్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, ఒక బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (BGL), పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, నక్సల్ సాహిత్యం, ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుపోయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మహారాష్ట్ర (Maharashtra) సరిహద్దులో ఉన్న అభుజ్మాడ్ అడవిలో ఈ ఉదయం ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు చెప్పారు.
Encounter | తెలంగాణకు చెందిన నేతలు
తాజా ఎన్కౌంటర్లో మృతి చెందిన రాజు దాదా, కోసాదాదా తెలంగాణకు చెందిన వారే. కరీంనగర్ (Karimnagar) జిల్లాకు చెందిన రాజు దాదా, కోసా దాదా మూడు దశాబ్దాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరిద్దరూ ‘దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ’ కార్యకలాపాల్లో పాల్గొన్నారని, గతంలో జరిగిన అనేక దాడుల్లో వీరిది కీలక పాత్ర అని నారాయణపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాబిన్సన్ గురియా వెల్లడించారు. బస్తర్ ప్రాంతంలో అనేక దాడులకు ప్రణాళికలు రూపొందించారని, ఈ దాడుల్లో భద్రతా దళాల సిబ్బంది, పౌరులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. “రాజు దాదాను గుడ్సా ఉసేండి, విజయ్, వికల్ప్ అనే మారుపేర్లతో కూడా పిలుస్తారు, కోసా దాదాను గోపన్న, బుచ్చన్న అని కూడా పిలుస్తారు. ఛత్తీస్గఢ్లో వారి తలలపై రూ. 40 లక్షల చొప్పున రివార్డు ఉంది ” అని గురియా వివరించారు.
Encounter | ఈ ఏడాదిలోనే 249మంది హతం
మావోయిస్టులకు ఈ సంవత్సరం అత్యంత దారుణమైన ఫలితాలను తెచ్చి పెడుతోంది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 249 మంది నక్సలైట్లు హతమయ్యారు. బస్తర్ డివిజన్లో జరిగిన ఎన్కౌంటర్లలోనే 220 మంది మృతి చెందారు. గరియాబంద్ జిల్లాలో 27 మంది, మోహ్లా-మన్పూర్-అంబాఘర్ చౌకి జిల్లాలో ఇద్దరిని కాల్చి చంపారు.