అక్షరటుడే, వెబ్డెస్క్: America | అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దోపిడీకి ప్రయత్నించిన దుండగుడిని ధైర్యంగా ఎదుర్కొన్న భారత (India) సంతతికి చెందిన మహిళను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన దారుణ సంఘటన యూనియన్ కౌంటీలోని పిక్నీ స్ట్రీట్లో రీసెంట్గా చోటుచేసుకుంది.
మృతురాలిని గుజరాత్కు చెందిన కిరణ్ పటేల్ (49) గా గుర్తించారు.స్థానికంగా ‘డీడీస్ ఫుడ్ మార్ట్’ (DeeDee’s Food Mart) పేరుతో కన్వీనియన్స్ స్టోర్ను నిర్వహిస్తూ ఉన్న కిరణ్ పటేల్ ఓ రోజు రాత్రి విధుల్లో ఉండగా, ముసుగు ధరించిన ఓ దుండగుడు తుపాకితో స్టోర్లోకి ప్రవేశించాడు. దోపిడీ చేయాలని వచ్చిన అతడిని చూసినా భయపడకుండా ధైర్యంగా అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎదురుదాడిలో భాగంగా ఆమె ఒక వస్తువును దుండగుడిపైకి విసిరారు. అనంతరం స్టోర్ వెలుపల పార్కింగ్ వైపు పరుగులు తీశారు.
America | ప్రవాస భారతీయుల్లో ఆందోళన..
అయితే ఆగ్రహించిన దుండగుడు వెంటాడుతూ ఆమెపై తీవ్ర కాల్పులు జరిపాడు. కిరణ్ పటేల్ (Kiran Patel) స్టోర్ బయట రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు. గాయాల తీవ్రతతో ఆమె అక్కడికక్కడే మరణించారు.సమాచారం అందుకున్న వెంటనే యూనియన్ కౌంటీ పబ్లిక్ సేఫ్టీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఘటన అనంతరం పరారైనట్లు గుర్తించగా, స్టోర్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతడి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.
ఈ హత్యతో స్థానిక ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన భారత సంతతి మహిళ ఈ తరహా దారుణ ఘటనకు గురికావడం ఆందోళన కలిగించే విషయమని వారు పేర్కొన్నారు. నిందితుడిని తక్షణమే పట్టుకుని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల గన్ కల్చర్ (Gun Culture) ఎక్కువ అవుతుండగా, భారత సంతతికి చెందిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.