అక్షరటుడే, వెబ్డెస్క్: ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నీలో ఇప్పుడు సూపర్-4 ఫైట్ నడుస్తున్న విషయం తెలిసిందే. శనివారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో సమష్టిగా రాణించిన బంగ్లా జట్టు శ్రీలంకను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ముందుగా బౌలింగ్లో కట్టుదిట్టంగా ఆడిన బంగ్లా.. అనంతరం బ్యాటింగ్లోనూ పరిపక్వత చూపింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. స్టార్ ఆల్రౌండర్ డసన్ షనక అద్భుతంగా ఆడుతూ 37 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 64 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతనికి కుశాల్ మెండిస్ (34), పాతుమ్ నిస్సంక (22) తోడయ్యారు.
Asia cup 2025 | శ్రీలంకకు షాక్..
బంగ్లా (Bangladesh) బౌలర్స్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3/20తో రాణించగా, మెహ్దీ హసన్ 2/25, టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నారు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా ఓపెనర్ సైఫ్ హసన్ (61), టౌహిడ్ హృదయ్ (58) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరి హాఫ్ సెంచరీలే విజయం బాట పట్టించాయి. అవసరమైన సమయంలో స్ట్రైక్ రొటేషన్, బౌండరీలు బాదడంతో బంగ్లా జట్టు సులువుగా గెలిచింది. బంగ్లాదేశ్ గెలవడానికి 6 బంతుల్లో 5 పరుగులు అవసరం కాగా, జాకెర్ అలీ బౌండరీ కొట్టి స్కోరు సమం చేశాడు. కానీ వెంటనే బౌల్డ్ అయ్యాడు. మెహ్దీ హసన్ కూడా వెంటనే వెనుదిరిగాడు. చివరికి షమీమ్ హొస్సేన్ (1 నాటౌట్) ఒక సింగిల్ తీయడంతో బంగ్లా విజయం సాధించింది.
శ్రీలంక Srilanka బౌలింగ్ విషయానికి వస్తే.. వానిందు హసరంగా 2/22, డసన్ షనక 2/21, నువాన్ తుషారా 1 వికెట్, దుష్మంత చమీరా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ సూపర్-4 దశను విజయవంతంగా ప్రారంభించింది. టోర్నీలో నెక్స్ట్ మ్యాచ్లకు ఇది మరింత ఉత్సాహాన్నిచ్చే అవకాశం ఉంది. మరొకవైపు, శ్రీలంక తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ రోజు భారత్ – పాకిస్తాన్ మధ్య సూపర్ ఫోర్లో తొలి ఫైట్ జరగనుంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది చూడాల్సి ఉంది.