అక్షరటుడే, వెబ్డెస్క్ : Party Defections | రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో అనర్హత భయం పట్టుకుంది. దీంతో వారు తాము బీఆర్ఎస్ (BRS)లోనే కొనసాగుతున్నామని ప్రకటిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్రెడ్డిని కలిసి కండువా కప్పించుకున్నారు. పార్టీ మారిన వారిలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), పోచారం శ్రీనివాస్రెడ్డి (బాన్సువాడ), బండ్ల కృష్ణమోహన్రెడ్డి(గద్వాల), కాలే యాదయ్య (చేవేళ్ల), సంజయ్ కుమార్ (జగిత్యాల), ప్రకాశ్గౌడ్ (రాజేంద్రనగర్), అరికపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మహిపాల్రెడ్డి (పటాన్చెరు) ఉన్నారు.
Party Defections | బీఆర్ఎస్ న్యాయ పోరాటం
కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని బీఆర్ఎస్ (BRS) నేతలు కేటీఆర్ (KTR), పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం మూడు నెల్లలో నిర్ణయం తీసుకోవాలని జులై 31న స్పీకర్కు సూచించింది. దీంతో స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు పంపుతున్నారు.
Party Defections | టెక్నికల్ అంశాలతో..
స్పీకర్ నోటీసులు పంపడంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది. ఎక్కడ తమపై వేటు పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సాంకేతిక అంశాల ఆధారంగా తప్పించుకోవాలని చూస్తున్నారు. తాము ఇంకా బీఆర్ఎస్లో కొనసాగుతున్నామని, అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసినట్లు నోటీసులకు వివరణ (Explanation of notices) పంపారు. తాజాగా సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సైతం కండువా కప్పితే పార్టీ మారినట్లేనా అని వ్యాఖ్యలు చేశారు.
Party Defections | ఆ ముగ్గురి పరిస్థితి ఏమిటీ?
పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో సాంకేతిక కారణాలతో పలువురు తప్పించుకునే అవకాశం ఉంది. అయితే వీరిలో ఖైతరబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన పదవికి రాజీనామా చేయకుండానే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో తాను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పడానికి ఆయనకు అవకాశం లేకుండా పోయింది.
బాన్సువాడ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్రెడ్డి (Pocharam Srinivas Reddy) సైతం హస్తం గూటికి చేరారు. ప్రభుత్వం ఆయనకు వ్యవసాయ సలహాదారు పదవి ఇచ్చింది. దీంతో ఆయనకు సైతం ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వ పదవి అనుభవిస్తున్న పోచారం బీఆర్ఎస్లో కొనసాగుతున్నానని చెప్పే అవకాశం లేదు. మరోవైపు స్టేషన్ ఘణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం చిక్కుల్లో పడేలా ఉన్నారు. ఆయన తన కుమార్తెకు కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఇప్పించి గెలిపించుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో బీఆర్ఎస్లో ఉన్నానని వివరణ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు సాంకేతిక అంశాలతో అనర్హత వేటు నుంచి తప్పించుకున్నా.. ఈ ముగ్గురిపై స్పీకర్ (Speaker) ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.