అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | హైడ్రా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా, డీఆర్ఎఫ్ (DRF) సిబ్బంది హైడ్రా కార్యాలయాన్ని ముట్టడించారు.
నగరం (Hyderabad)లోని బుద్ధభవన్లో గల హైడ్రా కార్యాలయం వద్దకు బుధవారం భారీ సంఖ్యలో హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. తమ జీతాలు (Salaries) తగ్గించారని వారు ఆందోళన నిర్వహించారు. కార్యాలయాన్ని ముట్టడించారు. విధులను బహిష్కరించి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు.
Hydraa | జీతాలు కట్ చేస్తున్నారని..
తమ జీతాలు కట్ చేస్తున్నారంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ రోజు నుంచి విధులకు వెళ్లకుండా నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. గతంలో జీహెచ్ఎంసీ (GHMC)లో పని చేసిన 1,100 మంది సిబ్బంది ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ విధానంలో హైడ్రాలో పని చేస్తున్నారు. తమతో రాత్రి, పగలు తేడా లేకుండా పని చేయించుకుంటున్నారని వారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన జీవో ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందిరికి ఒకేలా జీతాలు చెల్లించాలన్నారు. అయితే తమ జీతం మాత్రం రూ.5 వేలు కట్ చేసుకొని ఇస్తున్నారన్నారు. దాదాపు సగం మంది జీతాలు కట్ అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనంలో ఎందుకు కోత పెట్టారో తెలపాలని వారు డిమాండ్ చేశారు. మొత్తం జీతం ఇచ్చే వరకు విధులకు వెళ్లకుండా నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.
Hydraa | నిలిచిన సేవలు
హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బంది విధులు బహిష్కరించడంతో నగరంలో అత్యవసర సేవలు నిలిచిపోయాయి. కాగా ఇటీవల హైడ్రాలో పని చేస్తున్న మార్షల్స్ (Marshals) సైతం విధులు బహిష్కరించిన విషయం తెలిసిందే. వారు కూడా జీతాలు తగ్గించారనే నిరసన తెలిపారు. అయితే హైడ్రా కమిషనర్ వారితో మాట్లాడి ఎవరి జీతాలు తగ్గవని హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించారు. డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడా కమిషనర్ చర్చించే అవకాశం ఉంది.