అక్షరటుడే, మెండోరా : Sriram Sagar |ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (SRSP)కు ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 37 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
రాష్ట్రంలో, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి (Godavari)కి భారీగా వరద వస్తోంది. దీంతో ఎస్సారెస్పీలోకి 1.90 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. మంగళవారం 1.70 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. బుధవారం మరింత పెరిగింది. దీంతో అధికారులు దిగువకు నీటి విడుదలను భారీగా పెంచారు. 37 గేట్లు ఎత్తి 2,58,705 క్యూసెక్కులు వదులుతున్నారు.
Sriram Sagar | కాలువల ద్వారా నీటి విడుదల
ప్రాజెక్ట్ ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద కాలువకు 6,735, కాకతీయ కాలువకు 4 వేలు, సరస్వతి కాలువకు 800, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరు (Mid Manair), లోయర్ మానేరు డ్యాం (LMD)లు నిండటంతో వరద కాలువ ద్వారా నీటి విడుదలను తగ్గించారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 701 క్యూసెక్కుల నీరు పోతోంది.
Sriram Sagar | క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు వరద పోటెత్తడంతో అధికారులు నీటి విడుదలను భారీగా పెంచారు. ఇన్ఫ్లో కంటే ఔట్ఫ్లో అధికంగా ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో జలాశయం నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 1.90 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 2,75,372 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1088.1 (70.14 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. గోదావరిలోకి భారీగా నీటిని వదులుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.