అక్షరటుడే, వెబ్డెస్క్ : Railway Passengers | రైల్వే బోర్డు (Railway Board) కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల రిజర్వేషన్ విధానంలో పలు మార్పులు తీసుకొచ్చింది.
రైల్వే టికెట్లను ప్రయాణికులను ఐఆర్సీటీసీ (IRCTC) నుంచి బుక్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సాధారణ టికెట్ల బుకింగ్ కోసం ఆధార్ అథెంటికేషన్ అవసరం లేదు. అయితే ఇక నుంచి దీనిని తప్పని సరి చేస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. టికెట్లు విడుదలయ్యాక ఐఆర్సీటీసీ, అధికారిక యాప్లో మొదటి 15 నిమిషాలు ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఈ విధానం తత్కాల్ టికెట్ (Tatkal ticket) బుకింగ్లో అమలు చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి సాధారణ రిజర్వేషన్లకు కూడా అమలు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Railway Passengers | పక్కదారి పట్టకుండా..
దేశంలో నిత్యం కోట్లాది మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. చాలా మంది తమ ప్రయాణాలకు సంబంధించిన టికెట్లను ముందుగానే బుక్ చేసుకుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ముఖ్యమైన నగరాలకు రద్దీ అధికంగా ఉంటుంది. ఆయా రైళ్లలో టికెట్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం 60 రోజుల ముందుగా టికెట్ బుక్ (Ticket Booking) చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో టికెట్లను కొందరు అక్రమార్కులు బుకింగ్ ప్రారంభమైన వెంటనే సాఫ్ట్వేర్ సాయంతో బుక్ చేసేస్తున్నారు.
దీంతో సామాన్య ప్రయాణికులు టికెట్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో టికెట్లు పక్కదారి పట్టకుండా ఆధార్ అథెంటికేషన్ను రైల్వే బోర్డు తప్పనిసరి చేసింది. సామాన్యులకు సైతం టికెట్లు దొరకాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్ రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ బుకింగ్ సమాయాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, డిటెయిల్స్ సరి చూసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఓటీపీ ఎంటర్ చేస్తే ఆధార్ అథెంటికేషన్ (Aadhaar Authentication) పూర్తి అవుతుంది.