అక్షరటుడే, వెబ్డెస్క్ : Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పటికే పలు కాలేజీలు బంద్ పాటిస్తున్నాయి.
రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, ఇతర కాలేజీలకు భారీగా ఫీజు రీయింబర్స్మెంట్(Fee Reimbursement) బకాయిలు పేరుకుపోయాయి. వాటిని విడుదల చేయాలని కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే సోమవారం (నేటి) నుంచి కాలేజీలు బంద్ చేస్తామని గతంలోనే కాలేజీ యజమానులు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రైవేట్ కాలేజీల సంఘం నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) చర్చించారు. అయితే చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సోమవారం సాయంత్రం మరోసారి చర్చలు జరపనున్నారు.
Fee Reimbursement | సీఎంతో మంత్రుల భేటీ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy)తో భేటీ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో కాలేజీల డిమాండ్లపై వారు ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీల నాణ్యతపై దృష్టి పెట్టినట్లు సమాచారం. కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలపై బీఆర్ఎస్ హయాంలో విజిలెన్స్ కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్టును ప్రస్తుతం ప్రభుత్వం బయటకు తీసినట్లు తెలుస్తోంది.
Fee Reimbursement | కాలేజీల్లో అక్రమాలు
విజిలెన్స్లో నివేదికలో ప్రైవేట్ కాలేజీల(Private Colleges) అక్రమాలపై వివరాలు ఉన్నట్లు సమాచారం. చాలా ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, నాణ్యత పాటించకుండా ఫీజు రియింబర్స్మెంట్ పథకాన్ని కాలేజీలు వినియోగించుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో కాలేజీల అక్రమాలు, నాణ్యత విషయాలను ప్రభుత్వం చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. బకాయిల విషయంలో యాజమాన్యాలు వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం ఈ రిపోర్టు ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కాలేజీలు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ కాలేజీలు తమ పట్టు వదలకపోతే ఈ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పనున్నట్లు తెలుస్తోంది.
Fee Reimbursement | బంద్కు బీజేపీ మద్దతు
ప్రైవేట్ కాలేజీల బంద్కు మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు(Ramchandra Rao) తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో జీతాలు ఇవ్వలేని స్థితిలో యాజమాన్యాలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరితో విద్యార్థులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు.