అక్షరటుడే, వెబ్డెస్క్ : Orphans | సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. పేదరికం ఇంకా వెంటాడుతూనే ఉంది. కటిక పేదరికంలో పుట్టిన బిడ్డను సైతం అనాథల్లా వదిలేయడంతో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఈ పరిస్థితి చాలా వరకు తగ్గినా.. పూర్తిగా సమసిపోలేదు. ఇలా కామారెడ్డి పట్టణంలో అనాథల పరిస్థితిని చూసిన ఓ కవి చలించిపోయారు. అనాథల సమస్యలపై ఓ కవి తన ఆవేదనను కవిత రూపంలో వ్యక్తం చేశారు.
మేం అనాథలం అమ్మెవరో నాన్నెవరో తెలియని అనాథలం
పార్కుల్లోనో లాడ్జిల్లోనో
కామంతో కళ్లు మూసుకు పోయిన కసాయిలకు పుట్టిన అక్రమ సంతానం మేము
చెత్త కుండీల వద్ద విసిరి పారేసిన పిడికెడు మెతుకులు తింటూ మొండికి బతికిన అభాగ్యులం
ఆకలితో అలమటిస్తూ వీధుల్లో తిరుగుతూ అడుక్కు తినే దిక్కులేని అభాగ్యులం
మేము అనాథలం
ఎక్కడ దొంగతనం జరిగిన ముందుగా నిందించబడే దిక్కులేని పక్షులం
మేము అనాథలం
రోడ్డుపై కుక్కలతో పశువులతో చెలిమి చేసే విధి వంచితులం
మేము అనాథలం
చలిలో వణుకుతూ ఎండలో ఎండుతూ వానలో నానుతూ బిక్కుబిక్కు మంటూ రాత్రిళ్లు జాగారం చేసే వీధి బాలలం
పాలకుల దృష్టిలో మేము జనాభా లెక్కల్లో లేని అష్ట దరిద్రులం
మేము అనాథలం
పరయి పాలన పోయి స్వయం పాలన వచ్చిన
అతీ గతీ లేని అన్నార్థులం మేము అనాథలం
ఏం చేయాలో ఎటు పోవాలో తెలియని పసిమొగ్గలం మేము అనాథలం
ఏ నొప్పొచ్చినా రోగమొచ్చిన ఎవరితో చెప్పాలో తెలియని
వెట్టి బాలలం
మేము అనాధలం
ఓ దేవుడా మమ్మల్ని ఎందుకు పుట్టించావయ్యా
మాకు దిక్కెవరు?
– డి శ్రీరాం, కవి