అక్షరటుడే, వెబ్డెస్క్ : Bodhan | బోధన్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) శాఖలో జరిగిన రూ. 5 లక్షల నగదు చోరీ కేసు స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఓ బాలుడు వ్యవహరించిన తీరుతో పోలీసులు, ప్రజలు షాక్కు గురయ్యారు.
అంతటి భారీ మొత్తాన్ని, అది కూడా పట్టపగలు ఓ చిన్న వయస్కుడు చాకచక్యంగా అపహరించడంతో సంఘటన గురించి హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 8వ తేదీన బ్యాంకు క్యాషియర్(Bank Cashier) తన కౌంటర్ నుంచి రూ.5 లక్షల నగదు మాయం అయిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ ప్రారంభించారు.
Bodhan | మాస్టర్ మైండ్ బ్రెయిన్..
ఫుటేజీ పరిశీలించిన పోలీసులకు ఆశ్చర్యపోయే దృశ్యాలు కనిపించాయి. బ్యాంకులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, ఓ బాలుడు నేరుగా క్యాష్ కౌంటర్(Cash Counter) వద్దకు వెళ్లి, అక్కడ ఉన్న రూ.5 లక్షల నగదును అపహరించినట్లు స్పష్టమైంది. ఈ చోరీ వెనుక పెద్దల హస్తం ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. బాలుడికి మాయమాటలు చెప్పి పంపించి ఉంటారని , అతనిని ఓ సాధనంగా వాడి ఉంటారని అనుమానం వ్యక్తమవుతోంది. బాలుడికి సహకరించిన మిగిలిన వారిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీ(CCTV Footage) ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు.
పట్టణ సీఐ మాట్లాడుతూ.. ఇది చాలా ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన చోరీ. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి చట్టం ముందు హాజరుపరిచేలా చర్యలు తీసుకుంటాం,” అని తెలిపారు.పట్టపగలే బ్యాంకులో ఇలా భారీ నగదు చోరీకి పాల్పడడం, భద్రతపై అనేక ప్రశ్నలు నెలకొల్పుతోంది. చిన్న వయస్కుడే దొంగతనంలో ఇలా కీలక పాత్ర పోషించడంతో చిన్నారుల్ని ప్రలోభపెట్టి నేరాలు చేయిస్తున్న వారిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం వాడి నేరస్తుల్ని పట్టుకోవడం పోలిసింగ్ వ్యవస్థకు సవాల్గా మారింది. బాలుడి వయసును దృష్టిలో ఉంచుకుని జువెనైల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. మరి, అసలు చోరీకి మాస్టర్మైండ్ ఎవరో త్వరలో వెలుగులోకి రానుంది.