అక్షరటుడే, వెబ్డెస్క్ : Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లపై ఆయన శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో గోదావరి (Godavari) నది వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని వసతులు కల్పించాలన్నారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు.
Godavari Pushkaralu | పుష్కరాలు ఎప్పుడంటే..
గోదావరి పుష్కరాలు 2027లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. చాలా సమయం ఉన్నందున అధికారులు ఇప్పటి నుంచి శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 74 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు ఆయనకు వివరించారు. బాసర (Basara) నుంచి భద్రాచలం (Badrachalam) వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఉంటుందని సీఎం పేర్కొన్నారు. వాటిని మొదట అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
Godavari Pushkaralu | ఇబ్బందులు లేకుండా..
ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు అభివృద్ధి చేయాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పించాలని సూచించారు. మహా కుంభమేళాతో పాటు గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవమున్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సూచించారు.
Godavari Pushkaralu | కేంద్ర పథకాలను వినియోగించుకోవాలి
పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్తో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండే పనులు గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజీ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితాను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.