అక్షరటుడే, వెబ్డెస్క్ : Bangkok | బ్యాంకాక్లోని ప్రసిద్ధ సఫారీ వరల్డ్ జూలో (Safari World Zoo) భయానక సంఘటన చోటుచేసుకుంది. పర్యాటకుల కళ్లముందే సింహాల దాడికి గురైన జూ కీపర్ దుర్మరణం పాలయ్యాడు. 20 ఏళ్లుగా జూకీపర్గా పనిచేస్తున్న జియాన్ రంగ ఖరసమీ, జీప్లో పర్యాటకులను సఫారీకి తీసుకెళ్లాడు.
ఈ క్రమంలో ఆయన ప్రోటోకాల్ను (Protocol) ఉల్లంఘించి వాహనంలోనుంచి సింహాల ఎన్క్లోజర్లోకి దిగాడు. ఒక్కసారిగా మూడు సింహాలు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. సిబ్బంది తక్షణమే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
Bangkok | సింహాల దాడి..
సింహాల దాడిని అడ్డుకోవడానికి పర్యాటకులు (Visitors) హారన్ మోగించడం, కేకలు వేయడం వంటి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పర్యాటకుల ఎదుటే 15 నిమిపాల పాటు అతనిపై సింహాల గుంపు దాడిచేశాయి. ఈ ఘటనపై జూ అధికారులు (Zoo Officers) స్పందిస్తూ, గత 40 ఏళ్లలో ఇలాంటి ఘటన జరగలేదని తెలిపారు. పర్యాటకులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటన మరోసారి క్రూర జంతువులతో అప్రమత్తంగా ఉండకపోతే ఎంతటి ప్రమాదం సంభవిస్తుందో స్పష్టంగా చూపించింది.
సింహాలు, పులుల వంటి క్రూర మృగాలతో స్నేహం చేస్తూ, వాటితో సరదాగా ఆడుకునే వారిని సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. కానీ వాటితో ఏదో ఒక రోజు ముప్పు తప్పక వస్తుందని ఇలాంటి సంఘటనలు తెలియజేస్తుంటాయి. జూలో పనిచేసే సిబ్బంది ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ క్రూరజంతువులను రక్షిస్తుంటారు. వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకునే క్రమంలో ఒక్కోసారి ఇలా అనుకోని ప్రమాదాలు జరగవచ్చు. ప్రత్యేకంగా సింహాలు, పులుల సంరక్షణ సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకునే పని చేస్తూ ఉంటారు. కాస్త అజాగ్రత్తగా ఉన్నారో వారి ప్రాణాలు గాల్లో కలిసినట్టే.