అక్షరటుడే, బోధన్ : Bodhan | నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారు జామున విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. కాగా.. ఐసిస్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం బోధన్ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్నట్లు తెలిసింది.
కాగా.. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర నిఘా సంస్థలు, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో అషర్ డానిష్ను జార్ఖండ్లోని రాంచీలో అరెస్ట్ చేశాయి. అనంతరం అతడు ఇచ్చిన సమాచారం మేరకు దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదే సమయంలో రాష్ట్రంలోని బోధన్ పట్టణంలో కూడా దర్యాప్తునకు సంస్థకు చెందిన బృందాలు జల్లెడ పట్టాయి. పక్కా సమాచారం మేరకు ఉగ్ర మూలాలు కలిగిన వ్యక్తిని అరెస్టు చేశాయి. అతని వద్ద ఐసిస్ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టడంతో పాటు ఓ ఎయిర్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై స్థానిక పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం అధికారికంగా విషయాలు వెల్లడించలేదు.
గతంలోనూ బోధన్ పట్టణంలో ఉగ్రలింకులకు సంబంధించి ఎన్ఐఏ సహా పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేపట్టాయి. ఉగ్ర లింకులు కలిగిన వారిపై ఆరా తీశాయి. ప్రత్యేకించి బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు ఇక్కడి నుంచే పాస్పోర్టులు జారీ అయిన ఉదంతం కూడా అప్పట్లో చర్చకు దారి తీసింది. తాజాగా ఐసిస్తో సంబంధాలున్న వ్యక్తి పట్టుబడడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.