అక్షరటుడే, వెబ్డెస్క్ : Vice President Elections | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్పై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. క్రాస్ ఓటింగ్ చేసిందెవరు.. ఓట్లు చెల్లకుండ పోవడానికి గల కారణాలపై పోస్టుమార్టం ప్రారంభించింది.
మంగళవారం జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్రెడ్డి ఓటమి మూటగట్టుకున్నారు. ఎన్డీయే అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) విజయం సాధించారు. అయితే, విపక్ష పార్టీల సభ్యుల బలం కంటే సుదర్శన్రెడ్డికి తక్కువ ఓట్లు రావడం ఇండి కూటమిని నివ్వెర పరిచింది. రాధాకృష్ణన్కు ఊహించిన దాని కంటే ఎక్కువ మెజార్టీ రావడంతో క్రాస్ ఓటింగ్(Cross Voating) జరిగిందని తేలిపోయింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందన్న దానిపై కాంగ్రెస్ దృష్టి సారించింది.
Vice President Elections | త్వరలోనే సమావేశం
మంగళవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో(Vice President Election) క్రాస్ ఓటింగ్ లేదా ఉద్దేశపూర్వకంగా చెల్లని ఓట్లు వేసిన గుర్తించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్సభ మరియు రాజ్యసభ ప్రస్తుత బలాన్ని బట్టి చూస్తే, రాధాకృష్ణన్ కు ఎన్డీయే ఎంపీల నుంచి కనీసం 427 ఓట్లు పొందుతారని అంచనా వేశారు. అలాగే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) 11 ఓట్లు కూడా పడడంతో ఆయనకు 438 ఓట్లు పడతాయని భావించారు. అయితే, రాధాకృష్ణన్కు 452 ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో విపక్షాల బలాన్ని బట్టి 315 ఓట్లు రావాల్సిన బి. సుదర్శన్రెడ్డికి 300 ఓట్లు మాత్రమే వచ్చాయి.
Vice President Elections | మహారాష్ట్ర ఎంపీలు, ఆప్పైనే అనుమానం..
15 ఓట్లు తగ్గిపోవడంపై కాంగ్రెస్ పోస్టుమార్టం ప్రారంభించింది. ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి ఏడుగురు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు అనుమానిస్తోంది. శివసేన (UBT) నుంచి మూడు, కాంగ్రెస్ నుంచి నాలుగు ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడ్డాయని భావిస్తోంది. ఇక తమిళనాడు మూలాలున్న రాధాకృష్ణన్ కు మద్దతుగా డీఎంకే నుంచి కూడా క్రాస్-ఓటింగ్ జరిగి ఉండొచ్చని అనుమానిస్తోంది. అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ జస్టిస్ సుదర్శన్రెడ్డి(Justice Sudarshan Reddy)కి ఓటు వేయలేదని భావిస్తోంది. ఓటు ఎలా వేయాలనే దానిపై విపక్ష ఎంపీలకు అవగాహన కల్పించినప్పటికీ, 15 ఓట్లు చెల్లకుండా పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఎంపీలు కావాలనే ఓట్లు చెల్లకూడదన్న భావనతో తప్పుగా ఓటేసినట్లు అనుమానిస్తున్నారు.