అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (SRSP)లోకి ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు 8 వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
జలాశయంలోకి ప్రస్తుతం 54,545 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. అంతే మొత్తంలో ఔట్ఫ్లో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉంటుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు (1091 అడుగులు ) కాగా ప్రస్తుతం అంతేమొత్తం నీటితో నిండుకుండలా ఉంది.
Sriram Sagar | నీటి విడుదల వివరాలు
శ్రీరామ్సాగర్ నుంచి 8 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద కాలువ (Flood Canal)కు 19 వేలు, కాకతీయ కాలువ (Kakatiya Canal)కు 5,500, సరస్వతి కాలువకు 800, లక్ష్మి కాలువ ద్వారా 360 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలీసాగర్ ఎత్తిపోతలకు 360క్యూ సెక్యులు, గుత్ప ఎత్తిపోతలకు 270, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతుండగా, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు పోతుంది. నవంబర్ 20 వరకు ఖరీఫ్ పంటలకు నీటి విడుదల కొనసాగనుంది. మరోవైపు ప్రాజెక్ట్ వద్ద గల జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది.
Sriram Sagar | చేపల వేటకు వెళ్లొద్దు
శ్రీరామ్సాగర్ నుంచి గోదావరి (Godavari)లోకి, కాలువలకు నీటి విడుదల కొనసాగుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి సూచించారు. మత్స్యకారులు చేపల నదిలో చేపల వేటకు వెళ్లొద్దని ఆయన అన్నారు. పశువుల కాపర్లు, రైతులు సైతం నది, కాలువల సమీపంలోకి వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు.