అక్షరటుడే, వెబ్డెస్క్ : Allu Aravind | అల్లు ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) షాకుల మీద షాకులు ఇస్తుంది. పుష్ప 2 వివాదంతో అల్లు అర్జున్ ఉక్కిరి బిక్కిరి కాగా, ఇప్పుడు ఇది శాంతించినట్టే అనిపిస్తున్న వేళ, అల్లు ఫ్యామిలీకి మరోసారి షాక్ తగిలింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind)కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల తల్లి మరణం అనంతరం కుటుంబంగా దుఃఖంలో ఉన్న సమయంలోనే ఈ నోటీసులు రావడం గమనార్హం.
Allu Aravind | ‘అల్లు బిజినెస్ పార్క్’పై చర్యలు
హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 వద్ద ఉన్న అల్లు బిజినెస్ పార్క్ భవన నిర్మాణం పై GHMC అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సమాచారం ప్రకారం, ఈ భవనానికి GHMC నాలుగు అంతస్తుల వరకు మాత్రమే అనుమతిని మంజూరు చేసింది. ఇటీవల అధికారులు పరిశీలించగా, అనుమతి లేకుండా ఒక పెంట్హౌస్(Pent House)ను నిర్మించినట్లు గుర్తించారు. దీనిపై జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు అల్లు అరవింద్కు నోటీసులు(Show Cause Notices) పంపారు. “అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదు?” అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
2023 నవంబర్లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును, దివంగత నటుడు అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ప్రారంభించారు. గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి సంస్థల కార్యాలయాలు ఈ భవనంలో ఉండనున్నాయి. ఇది అల్లు ఫ్యామిలీ వ్యాపార కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారనుంది.అయితే ఇప్పుడు అక్రమ నిర్మాణాల కారణంగా ఈ భవనం వివాదాస్పదంగా మారింది.ఈ నోటీసులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు “కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేస్తోంది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అల్లు ఫ్యామిలీకి చెందిన పుష్ప 2 సినిమాపై జరిగిన వివాదం, ఇప్పుడు బిజినెస్ పార్క్ పై GHMC చర్యలు ఇవన్నీ సాంకేతికంగా జరిగిన చర్యలేనా? లేక రాజకీయ ఉద్దేశంతోలానా అన్నదాని పై చర్చ జరుగుతోంది.