అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల క్రితం శ్రీరాంసాగర్ వద్ద హైవేపై వెళ్తున్న బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు.
తాజాగా.. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని దేవీ తండా పెట్రోల్ బంక్ ఎదురుగా 44వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న కారు పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో నర్సింహా రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి విశాల్కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నిజామాబాద్కు తరలించారు. కాగా.. వీరు హైదరాబాద్ నుంచి ఇచ్చోడ వెళ్తున్నట్లు తెలిసింది.