అక్షరటుడే, వెబ్డెస్క్: Non-veg shops | గణేశ్ నవరాత్రుల (Ganesh Navaratri) సందర్భంగా చాలా మంది నాన్వెజ్కి దూరంగా ఉన్నారు. తొమ్మిది రోజుల పాటు వినాయకుని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఇక నవరాత్రులు ముగియడంతో నగరంలో నాన్ వెజిటేరియన్ ప్రియులకు పండుగ మళ్లీ మొదలైంది.
దాదాపు పదిరోజుల విరామం తర్వాత హైదరాబాద్లోని మాంసం మార్కెట్లు (Hyderabad Non-veg Markets) కళకళలాడుతున్నాయి. నాన్ వెజ్ దుకాణాల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. పండుగ రోజుల్లో మాంసాహారం తినకుండా ఉన్న ప్రజలు ఇప్పుడు ఆ లోటును తీర్చుకుంటున్నారు.
Non-veg shops | మళ్లీ మంచి రోజులు..
ఈ ఆదివారం చికెన్ షాపుల (Chicken Shops) వద్ద రద్దీ కనిపించింది. స్కిన్తో చికెన్ ధర రూ.220 కాగా, స్కిన్లెస్ చికెన్ ధర రూ.240గా ఉంది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. వ్యాపారులు కూడా దీనిని గమనించి అదనపు స్టాక్ను సిద్ధం చేసుకున్నారు. “గత పదిరోజులుగా వ్యాపారం బాగా తగ్గిపోయింది. ఇప్పుడైతే మళ్లీ ఊపులోకి వస్తోంది,” అని పలువురు చికెన్ షాప్ యజమానులు తెలిపారు. మటన్ ధరలు (Mutton Price) మాత్రం గతంలో మాదిరిగానే కొనసాగుతున్నాయి. మటన్ ధర రూ.950 – రూ.1000 (కిలోకు)గా ఉంది. గణేశ్ నవరాత్రుల సమయంలో వినియోగం తగ్గినా, మటన్ ధరల్లో ఎలాంటి ప్రభావం కనిపించలేదని వ్యాపారులు చెబుతున్నారు.
చేపల మార్కెట్లో కూడా సందడి నెలకొంది. నాన్ వెజ్ వేట మొదలైన నేపథ్యంలో ఈ ఆదివారం చేపల మార్కెట్లు (Fish Markets) కూడా బిజీగా మారాయి. బొచ్చ చేప ధర రూ.200గా ఉండగా, కొర్రమీను ధర రూ.300 వరకు ఉంది. ప్రజలు పెద్దఎత్తున చేపలు కొనుగోలు చేయడంతో, మార్కెట్ యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నవరాత్రుల తర్వాత ప్రజలు నాన్వెజ్ తినేందుకు బాగా ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆదివారం చూసిన రద్దీని బట్టి, రాబోయే రోజుల్లో మాంసం వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే సరఫరా పెరిగితే ధరలు స్థిరంగానే కొనసాగుతాయని వారు భావిస్తున్నారు.