అక్షరటుడే, వెబ్డెస్క్ : Online Gaming | ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్పై ప్రభుత్వం విధించిన నిషేధం సత్ఫలితాలను ఇస్తోంది. తొమ్మిది రోజుల వ్యవధిలోనే గేమింగ్ రంగంలో 25 శాతం లావాదేవీలు తగ్గుముఖం పట్టడం విశేషం. కేంద్ర విధించిన నిషేధం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలపై తక్షణ ప్రభావాన్ని చూపింది.
UPIని నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. గేమింగ్ రంగంలో తొమ్మిది రోజుల్లోనే రూ.2,500 కోట్ల తగ్గుదల కనిపించింది. UPI ప్లాట్ఫామ్ నివేదించిన ప్రకారం.. జూలైలో రూ.10,076 కోట్లకు పైగా విలువైన 351 మిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. అయితే, ఆన్లైన్ గేమింగ్(Online Gaming)పై నిషేధం విధించిన తర్వాత ఆగస్టులో గేమింగ్ విభాగంలో రూ.7,441 కోట్ల విలువైన 271 మిలియన్ లావాదేవీలు జరిగాయి. అంటే రోజుల వ్యవధిలోనే 25 శాతం తగ్గుదల నమోదైంది.
Online Gaming | నిషేధంతో తగ్గిన లావాదేవీలు..
రియల్ మనీగేమ్(Real Money Game)పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టులో చట్టం తీసుకొచ్చింది. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న ఈ గేమ్లపై చర్యలు చేపట్టింది. ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడుతున్న యువత భారీగా డబ్బు కోల్పోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటివెన్నో ఉదంతాలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం రియల్ మనీ గేమింగ్లను నిషేధించింది. ఈ నిర్ణయం ఎంతటి ప్రభావం చూపిందో యూపీఐ లావాదేవీల్లో(UPI Transactions) తగ్గుదల ఎత్తి చూపుతోంది. ప్రతినెల రూ.10 వేల కోట్లకు పైగా లావాదేవీలు రియల్ మనీ గేమింగ్లో జరుగుతున్నాయి. రియల్-మనీ వాలెట్ లోడింగ్లో 90 శాతానికి పైగా UPI ద్వారా జరుగుతుంది. వార్షిక టర్నోవర్ రూ.1.2 లక్షల కోట్ల పరిధిలో ఉందని NPCI డేటా తెలిపింది. అయితే, గేమింగ్పై నిషేధం విధించడంతో ఇప్పుడది భారీగా తగ్గిపోయింది.
గేమింగ్ విభాగంలో UPI ప్లాట్ఫామ్లో దాదాపు 350-400 మిలియన్ల నెలవారీ లావాదేవీలు జరిగాయి, ఇది మొత్తంగా ప్రతి నెలా 19 బిలియన్లకు పైగా ప్రాసెస్ చేస్తుంది. దీని విలువ దాదాపు రూ. 25 లక్షల కోట్లు. దేశీయ లీగ్ క్రికెట్ సిరీస్ IPL కారణంగా ఏప్రిల్లో UPI ద్వారా నెలవారీ లావాదేవీల సంఖ్య 500 మిలియన్లకు చేరుకుందని NPCI డేటా చెబుతోంది.