అక్షరటుడే, కామారెడ్డి: Ganesh immersion | కామారెడ్డి పట్టణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నామని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) స్పష్టం చేశారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా పట్టణం నిఘా నీడలో ఉండనుందని ఆయన తెలిపారు.
గణేశ్ నిమజ్జన శోభాయాత్ర (Nimajjana Shobhayatra) సాఫీగా, ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఆయన పోలీసు సిబ్బందితో శుక్రవారం నిమజ్జన బందోబస్తుపై సమావేశం నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలో (Kamareddy) గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు శాంతియుతంగా, సురక్షితంగా జరగడానికి జిల్లా పోలీసు శాఖ ద్వారా అన్ని విధాలైన ఏర్పాట్లు ఇప్పటికే చేసిందన్నారు.
Ganesh immersion | పటిష్ట బందోబస్తు
శోభాయాత్ర కోసం సుమారు 300 మంది పోలీసు అధికారులు, సిబ్బంది నియమించడం జరిగిందని, 120 సీసీ కెమెరాలను, 2 డ్రోన్ కెమెరాలను (Drone cameras) ఏర్పాటు చేసి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. శోభాయాత్రలో పాల్గొనే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రూట్మ్యాప్ ప్రకారం శోభాయాత్ర సాఫీగా కొనసాగే విధంగా చూడాలన్నారు. శోభాయాత్ర మార్గాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా బారికేడింగ్, ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ పోలీసు విభాగం తరఫున బలమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో ముఖ్య రహదారులపై ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తూ, ప్రత్యేక పోలీసు బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు.
Ganesh immersion | సిబ్బందికి సూచనలు
శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎటువంటి సంఘటనలు జరగకుండా సమన్వయంతో, ఓపికతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. గణేశ్ శోభాయాత్ర రూట్ను పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు. ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలు, నిమజ్జన ఘాట్లు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అదనంగా పోలీసులను మోహరించాలన్నారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పి నర్సింహారెడ్డి, కామారెడ్డి సబ్డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.