అక్షరటుడే, కామారెడ్డి/ఎల్లారెడ్డి : CM Tour | జిల్లాలో సీఎం పర్యటన కొనసాగనుంది. మరికొద్దిసేపట్లో ఆయన హెలికాప్టర్ ద్వారా లింగంపేట మండలానికి చేరుకోనున్నారు. వరద బాధిత ప్రాంతాలను పరిశీలించి కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ (GR Colony) ముంపు బాధితులను పరామర్శించనున్నారు.
CM Tour | మాజీ ఎమ్మెల్యే సురేందర్ ముందస్తు అరెస్ట్..
సీఎం పర్యటన (CM Tour) నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు ఉపక్రమించారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దారుణామని సురేందర్ (Jajala Surender) మండిపడ్డారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాకుండా పోలీసుల రాజ్యం నడుస్తోందని విమర్శించారు. రైతులను మోసం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. అరెస్టులు చేయడం కాదు.. నష్టపోయిన నియోజకవర్గానికి ప్రత్యేక నిధులతో కూడిన ప్యాకేజీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) ఆయన డిమాండ్ చేశారు.
అలాగే సీపీఎం, సీఐటీయూ, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్మిక యూనియన్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. గాంధారి మండలానికి చెందిన లబానా సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు తాన్సింగ్ నాయక్ను (Tan Singh Naik) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అరెస్టయిన వారు మాట్లాడుతూ.. సీఎం వస్తే అక్రమ అరెస్టులు సరికావన్నారు. తాము సీఎంను కలిసేది ఉంటే శాంతియుతంగా సమస్యల పరిష్కారం కోసం కలుస్తామని తెలిపారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని పేర్కొన్నారు.
CM Tour | భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధుల నిర్బంధం..
సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్ రెడ్డిని (Paidi Vitthal Reddy) బుధవారం రాత్రి తాడ్వాయి పోలీస్స్టేషన్లో నిర్బంధించారు. ఈ చర్య రైతులను అవమానపర్చడమేనని ఆయన పేర్కొన్నారు.