అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | కల్యాణి ప్రాజెక్టు అధికారుల (Kalyani project officials) నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు మట్టి గట్లు కొట్టుకుపోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వరద గేట్లు ఎత్తి ఉంటే భారీ నష్టం తప్పి ఉండేదని పేర్కొంటున్నారు. ఇటీవలి వర్షాలకు తిమ్మాపూర్ తాటివాని మత్తడి లక్ష్మాపూర్ చెరువులు తెగిపోవడంతో ఒక్కసారిగా 40వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చింది.
దీంతో ప్రాజెక్టు సిబ్బంది క్రస్ట్ గేట్లు సకాలంలో ఎత్తలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 2006 లోనూ అధికారులు క్రస్ట్ గేట్లు మరమ్మతులు చేయకపోవడంతో అవి మొరాయించాయని, ఫలితంగా భారీ వరదకు (heavy flood) తట్టుకోలేక మూడు గేట్లు కొట్టుకుపోయాయి. మళ్లీ ఈసారి సైతం వరదను అంచనా వేయడంలో అధికారులు, సిబ్బంది విఫమయ్యారని ఆరోపిస్తున్నారు.
Yellareddy | భారీగా నష్టం..
ప్రాజెక్టు అధికారులు (project officials), సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వందల ఎకరాల్లో పంటలు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. వరద కారణంగా పొలాల్లో ఇసుక మేటలు వేసిందని, రాళ్లు, బురద పేరుకుపోవడంతో వాటిని తొలగించేందుకు తీవ్ర ఇబ్బందితోపాటు వ్యయప్రయాస అవుతోందన్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు కళ్ల ముందే దెబ్బతిన్నాయని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
వర్షం కురిసిన రాత్రి సిబ్బంది ప్రాజెక్టు గేట్లను (project gates) ఎత్తేందుకు ప్రయత్నించినా.. లేవకపోవడం కారణమా? లేదా వరద ఉధృతికి సిబ్బంది భయాందోళనకు గురయ్యారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సకాలంలో ఏడు వరద గేట్లను ఎత్తి ఉంటే ముంపు ముప్పు ఉండేది కాదని రైతులు వాపోతున్నారు. గేట్లు ఎత్తకపోవడంతోనే ప్రాజెక్టు గట్లు కొట్టుకుపోయాయి.
అంతేగాక, కోళ్ల ఫారం వద్ద 13 మంది బీహార్ కూలీలు (Bihar Workers) వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోనైనా ప్రాజెక్టు గేట్లను ఎత్తేందుకు ప్రయత్నించినా.. సిబ్బంది ప్రాణభయంతో ఎత్తలేరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై నీటిపారుదల శాఖ అధికారులను (Irrigation Department officials) సంప్రదించగా ఐదు గేట్లు స్వల్పంగా ఎత్తినట్లు పేర్కొంటున్నారు. పూర్తిస్థాయిలో 7 గేట్లను ఎత్తి ఉంటే ఇంతటి భారీ నష్టం ఉండేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ముప్పుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.