అక్షరటుడే, వెబ్డెస్క్ : India-China | భారతదేశం-చైనా సంబంధాలను పరస్పర విశ్వాసం, గౌరవం. సున్నితత్వం ఆధారంగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు 2.8 బిలియన్ల ప్రజల ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయన్నారు. చైనా పర్యటనలో ఉన్న ప్రధాని ఆదివారం చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్తో (China President Xi Jinping) సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. గత సంవత్సరం, మేము కజాన్లో చాలా అర్థవంతమైన చర్చను నిర్వహించామని, ఇది రెండు దేశాల సంబంధాలకు సానుకూల దిశానిర్దేశం చేసిందని గుర్తు చేశారు. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం ఏర్పడిందని, సరిహద్దు నిర్వహణపై మా ప్రత్యేక ప్రతినిధులు ఒక అవగాహనకు చేరుకున్నారని తెలిపారు . కైలాస్ మానసరోవర్ యాత్ర (Kailash Mansarovar Yatra) పునఃప్రారంభం, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు.
India-China | ప్రపంచ మానవాళి సంక్షేమం కూడా..
ఇండియా, చైనా మధ్య సహకారం రెండు దేశాలకు చెందిన 2.8 బిలియన్ల ప్రజల (2.8 billion people) ప్రయోజనాలతో ముడిపడి ఉందని మోదీ అన్నారు. అంతేకాదు, ఇది మొత్తం మానవాళి సంక్షేమానికి కూడా మార్గం సుగమం చేస్తుందన్నారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా మా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
India-China | డ్రాగన్, ఏనుగు కలిసి ఉండాలి..
భారతదేశం, చైనా మంచి స్నేహితులుగా, పొరుగువారుగా ఉండటం చాలా ముఖ్యమని చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు, గ్లోబల్ సౌత్లో కూడా ముఖ్యమైన పోషిస్తున్నాయన్నారు. రెండు ప్రజల శ్రేయస్సును మెరుగుపరచడం, అభివృద్ధి చెందుతున్న దేశాల పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించడం. మానవ సమాజ పురోగతిని ప్రోత్సహించడం అనే చారిత్రక బాధ్యతను మనమిద్దరం భుజాలపై వేసుకున్నామని తెలిపారు.
“రెండు దేశాలు మంచి పొరుగు వారిగా, స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్న స్నేహితులుగా, ఒకరికొకరు విజయానికి దోహదపడే భాగస్వాములుగా ఉండాలని” ఆకాక్షించారు. డ్రాగన్ మరియు ఏనుగు (dragon and elephant) కలిసి ముందుకు నడవడం సరైన ఎంపిక అని అన్నారు. వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథం నుంచి రెండు దేశాలు సంబంధాలను పునరుద్ధరించుకోవాలని పేర్కొన్నారు. బహుళ ధ్రువ ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు కలిసి నడవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి, శ్రేయస్సు కోసం రెండు అతి పెద్ద దేశాలు కలిసి పని చేయాలన్నారు.