అక్షరటుడే, వెబ్డెస్క్ : BC bill | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో (Assembly) ప్రవేశపెట్టింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం అనంతరం బిల్లును సభ ఆమోదించింది.
బీసీ బిల్లుతో పాటు పంచాయతీరాజ్ యాక్ట్ 285Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులకు (Municipal Act Amendment Bill) కూడా ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. పంచాయతీల్లో రిజర్వేషన్పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉద్దేశించిన బిల్లును మంత్రి సీతక్క (Minister Seethakka) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు మూడు బిల్లులపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
BC bill | బీసీ బిల్లుపై రచ్చ..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బిల్లుపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) మాట్లాడుతూ.. బీసీల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని, బిల్లుకు మద్దతిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు.. బహుజన రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలని, తూతూమంత్రంగా కాకుండా చట్టబద్ధంగా, శాస్ట్రీయంగా రిజర్వేషన్ల విషయంలో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ బిల్లు తీసుకొచ్చి ఆ తర్వాత జీవో ఇచ్చి బీసీలకు అన్యాయం చేయొద్దు.. షెడ్యూల్ 9లో బీసీ రిజర్వేషన్లను (BC reservations) చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
బీసీ బిల్లు అమలును తమిళనాడు (Tamil Nadu) తరహాలో శాస్త్రీయ పరంగా చేయండి, అశాస్త్రీయంగా చేస్తే బీహార్, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల్లో ఫెయిల్ అయినట్లుగా అవుతుందని హెచ్చరించారు. అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యాక జీవో ఇవ్వాలంటే.. మరి ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఏం చేశారు? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఇస్తామని చెప్పారు కదా.. అదే రోజు జీవో ఇవ్వకుండా సుమారు ఆరు కమిటీలు ఎందుకు వేశారు? అని గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) జోక్యం చేసుకుంటూ బీసీల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని, రాజకీయ విమర్శలు సరికాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గంగులనుద్దేశించిన చేసిన వ్యాఖ్యలు కాసేపు దుమారం రేపాయి. అనంతరం గంగుల మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు రావాలంటే న్యాయవ్యవస్థల్లో చిక్కులు రాకూడదని, బిల్లు పాస్ చేసుకుని జీవో తెచ్చి ఎన్నికలకు పోతే చిక్కులు వస్తాయని తెలిపారు. తమ సూచనలను విమర్శగా భావించకుండా 2 కోట్ల మంది భవిష్యత్ కు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచించారు. జీవో ఇచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థలో చిక్కు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.
BC bill | ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం..
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) జోక్యం చేసుకుంటూ బీఆర్ఎస్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నామని, బీసీలకు న్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్లోని ముఖ్య నాయకులకు ఎంతో బాధ ఉందన్నారు. గంగులపై ఒత్తిడి ఉంటే నేను చూసుకుంటా.. మనం పాత మిత్రులమే కదా.. ఆరోపణలు చేయకుండా సూచనలు చేయండి.. అంటూ రేవంత్ పేర్కొన్నారు. ఎవరి ఒత్తిడితోనే గంగుల విమర్శలు చేస్తున్నారని, గంగులపై ఒత్తిడి ఉంటే తాను చూసుకుంటానని తెలిపారు.
బీసీలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధితో ఉన్నామని అంతా బిల్లుకు సహకరించాలని సీఎం సభను కోరారు. బీసీ రిజర్వేషన్లు గంగులకు ఇష్టమే.. కానీ వాళ్ల నాయకులకే ఇష్టం లేదంటూ సీఎం పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ తెచ్చిన రెండు చట్టాలు గుదిబండగా మారాయని, అడ్డంకులు తొలగించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కు పంపించామని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత గవర్నర్, గత సీఎం మధ్య సాన్నిహిత్యం వల్ల బిల్లులు ఆగాయని ఆరోపించారు.
BC bill | ఏకగ్రీవంగా ఆమోదం..
బీసీ బిల్లుతో పాటు పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణలకు (Panchayati Raj Municipal Act amendments) అన్ని పక్షాలు మద్దతు తెలిపాయి. చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నప్పటికీ, అంతిమంగా బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించారు. అటు ఎంఐఎం, సీపీఐ కూడా బిల్లులకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. బీసీ బిల్లుకు మద్దతునిస్తున్నామని, అయితే మరింత స్పష్టత ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. 42 శాతం రిజర్వేషన్లలో ముస్లింలు కూడా ఉంటారా? వారిని కలుపకుండా కేవలం బీసీలకే రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది.