అక్షరటుడే, కామారెడ్డి: Heavy rains | కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం తీవ్ర ఆందోళనకర పరిస్థితి సృష్టించింది. జిల్లా చరిత్రలోనే అత్యధిక వర్షపాతం బుధవారం (ఆగస్టు 27) రోజు కురిసిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. కామారెడ్డిలో కుండపోత వర్షాలు సృష్టించిన బీభత్సాన్ని డోన్ చిత్రాలు కళ్లకు కడుతున్నాయి.

Heavy rains | కామారెడ్డి పట్టణంలో..
కామారెడ్డి పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నిజాంసాగర్ చౌరస్తాలోని (Nizamsagar Cowrastha) లయోల పాఠశాల, విద్యానగర్, రైల్వే బ్రిడ్జి ప్రాంతం, సిరిసిల్ల రోడ్డు (Sirisilla Road) రహదారులు నీటిలో మునిగిపోయాయి.

పంచముఖి హనుమాన్ కాలనీలో వాహనాలు నీట మునిగాయి. బతుకమ్మ కుంట కాలనీలో ఇళ్లు నీట మునిగిపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో వాగు ప్రవాహానికి 5 కార్లు కొట్టుకుపోయాయి.

భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఎడ్లకట్ట వాగు ఉద్ధృతికి 44వ జాతీయ రహదారి National Highway 44 నీటిలో చిక్కుకుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా పోలీసులు రహదారిని పూర్తిగా మూసివేశారు.

రేపు విద్యాసంస్థలకు సెలవు
Kamareddy జిల్లాలో భారీ వర్షం నేపథ్యంలో జిల్లాలోని విద్యాసంస్థలకు గురువారం (ఆగస్టు 28) సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోరారు. వరద ప్రాంతాల్లో పర్యటించవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. సహాయం కోసం అధికారులను సంప్రదించాలన్నారు.