అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. మెదక్, కామారెడ్డి (Kamareddy) జిల్లాల్లో కుండపోత వాన కురుస్తోంది. హైదరాబాద్ నగరంలో సైతం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో సీఎం రేవంత్రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందిని ఆదేశించారు.
CM Revanth Reddy | సమన్వయంతో పని చేయాలి
హైదరాబాద్ (Hyderabad) నగరంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ (Irrigation) అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
CM Revanth Reddy | పారిశుధ్య పనులు చేపట్టాలి
వర్షాలతో వరద, మురుగు నీరు నిలచి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని సీఎం పేర్కొన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యారోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు.