అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. అల్పపీడన (LPA) ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అర్ధరాత్రి నుంచి వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ముఖ్యంగా మెదక్ (Medak), కామారెడ్డి (Kamareddy) జిల్లాల్లో అతి భారీ వర్షాలు (Heavy Rains) పడుతుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ రోజంతా రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని, అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.
రాష్ట్రంలోని సిద్దిపేట, జనగామ, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, భూపాలపల్లి, నారాయణపేట, ములుగు జిల్లాల్లో బుధవారం మోస్తరు వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సైతం రాత్రి నుంచి వాన పడుతోంది. రోజంత మోస్తరు వాన కురిసే అవకాశం ఉంది.
Weather Updates | అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మంగళవారం రాత్రి నుంచి కుండపోత వానతో పలు జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు ముంచెత్తడంతో లోతట్లు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నుంచి నీరు పారుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని కోరారు. చెరువులు, వాగుల సమీపంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.