అక్షరటుడే, ఇందూరు: MP Dharmapuri Arvind | బీజేపీ ఇందూరు పార్లమెంట్ పరిధిలో ఎంతో బలం ఉందని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) అన్నారు. 2019, 2024 ఎన్నికల ఆ విషయం నిరూపితమైందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని 2019లో కేసీఆర్ కూతురు కవిత ప్రశ్నించారని.. నాడే ఇందూరు ప్రజలు చూపించారని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతం నుంచి ఓట్లిచ్చినం.. సీట్లిచ్చినమని.. రాష్ట్ర కమిటీలో మా వాటా పదవులు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును కోరారు.
ఎక్కడైతే పార్టీకి బలం ఉంటుందో అక్కడ పదవులు కచ్చితంగా ఇవ్వాలన్నారు. నిజామాబాద్ నగరంలో సోమవారం నిర్వహించిన ఇందూరు, జగిత్యాల జిల్లా పార్టీ కార్యకర్తల (Jagtial district party workers) సమ్మేళనంలో మాట్లాడారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో (2024 Parliament elections) బీజేపీకి 48 శాతానికి పైగా ఓట్లు వచ్చాయన్నారు. బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 51 శాతానికి పైగా ఓట్లు సాధించామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నియోజవర్గంలో (Jagityala constituency) కూడా 50 శాతం దాటుతాయన్నారు. రాష్ట్ర నాయకత్వంలో తన పార్లమెంట్ పరిధిలోని కార్యకర్తలకు చోటు కల్పించాలని కోరారు. పార్టీని అభివృద్ధి చేసే బాధ్యత, కొత్తవారికి అవకాశం ఇచ్చే బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడిదన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేయాలని.. తామంతా వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు.
రాకేశ్ రెడ్డి బీజేపీ చేరేసమయంలో పార్టీలోని కొందరు పెద్దలు అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. అనవసర పుకార్లు పుట్టించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయమై పార్టీ అధిష్టానం (party high command) దృష్టిగా తీసుకెళ్లి.. రాకేశ్ రెడ్డి (MLA Rakesh Reddy) చేర్చుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామన్నారు. పుకార్లు సృష్టించిన నేతలే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ రాష్ట్ర జిల్లా కమిటీలో అలాంటి సీనియర్లకే పదవులు ఇస్తున్నారంటూ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్తవారికి అవకాశం కల్పించాలన్నారు. పార్టీ ఎదుగుదలను అడ్డుకునే వారికి తాను ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడతానని పేర్కొన్నారు.
బీజేపీ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడంలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా డబుల్ బెడ్రూం మంజూరు చేయలేదని పేర్కొన్నారు. అలాంటి మా కార్యకర్తల కోసం ప్రభుత్వం తీసుకురావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో మొట్టమొదటి జిల్లా పరిషత్, మున్సిపల్ ఛైర్మన్ ప్రకటన నిజామాబాద్ నుంచే వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 31 మంది కార్పొరేటర్లు ఉంటే.. 28 మంది నిజామాబాద్లో ఉన్నారన్నారు. అందుకే నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తలకు (Nizamabad Parliament workers) ఎక్కువ పదవులు ఇవ్వాలని కోరారు.
సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (District President Dinesh Kulachari), అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, నాయకులు లోక భూపతిరెడ్డి, పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.