అక్షరటుడే, వెబ్డెస్క్: Nikki Haley | చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు భారతదేశం లాంటి భాగస్వామి అవసరమని రిపబ్లికన్ నాయకురాలు, ఐక్యరాజ్యసమితిలో మాజీ అమెరికా రాయబారి నిక్కీ హేలీ (Former US Ambassador Nikki Haley) అభిప్రాయపడ్డారు. రష్యా చమురు కొనుగోళ్ల పై అమెరికా లేవనెత్తి అభ్యంతరాలను పరిష్కరించుకోవడం కోసం కృషి చేయాలని ఇండియాకు సూచించారు.
రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారతదేశంపై సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేయడంపై ఆమె మొదటి నుంచి వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. “రష్యా చమురుపై (Russian oil) ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను భారతదేశం తీవ్రంగా పరిగణించాలి. ఈ సమస్య పరిష్కారం కనుగొనడానికి వైట్ హౌస్తో (White House) కలిసి పనిచేయాలి. ఇది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య దశాబ్దాల స్నేహం, సద్భావన ప్రస్తుత గందరగోళాన్ని అధిగమించడానికి బలమైన ఆధారాన్ని అందిస్తాయి. వాణిజ్య విబేధాలు, రష్యన్ చమురు దిగుమతులు వంటి సమస్యలను అధిగమించడానికి బలమైన చర్చలు, సంప్రదింపులు అవసరం. చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు (America) భారతదేశం లాంటి స్నేహితుడు ఉండాలి, ”అని ఆమె ’X’లో పోస్ట్ చేశారు.
Nikki Haley | వ్యూహాత్మక విపత్తు..
భారత్ పట్ల ఎల్లప్పుడూ సానుకూల వైఖరితో ఉండే హేలీ.. ట్రంప్ చర్యలను తప్పుబడుతూ ఇటీవల విమర్శించిన సంగతి తెలిసందే. న్యూఢిల్లీ (New Delhi) అమెరికాకు ఎందుకు ముఖ్యమైనదో పేర్కొంటూ ఇటీవల ఆమె గుర్తు చేశారు. చైనాను ఎదుర్కోవడానికి భారతదేశం విలువైన స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య భాగస్వామి అని హేలీ అన్నారు. న్యూఢిల్లీతో 25 సంవత్సరాల బంధాన్ని దూరం చేసుకోవడం వ్యూహాత్మక విపత్తు అని ఆమె అభివర్ణించారు.