అక్షరటుడే, వెబ్డెస్క్ : Dharmasthala Case | ధర్మస్థల సామూహిక ఖననం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. యువతులపై అత్యాచారాలు, సామూహిక ఖననాల ఆరోపణలన్నీ కట్టుకథలేన్న విషయం నిర్ధారణ అవుతోంది.
అసలు ఈ కేసుకు మూలాధారమైన వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వందల మృతదేహాలను ఖననం చేశానని చెప్పిన ముసుగు వ్యక్తి భీమాను విచారించిన సిట్ అధికారులు అతడ్ని అరెస్టు చేశారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించాడని భీమాపై చర్యలు చేపట్టారు. ధర్మస్థల(Dharmasthala)కు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడనే అభియోగంతో అదుపులోకి తీసుకున్నారు.
Dharmasthala Case | తప్పుడు సమాచారంతో..
ఇటీవల ధర్మస్థల వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో వందలాది మంది మృతదేహాలను తాను పూడ్చిపెట్టానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా(Former Sanitation Worker Bheema) ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. అయితే, నిందితుడి ఆరోపణలోని వాస్తవాలను పై ఏమాత్రం పరిశీలించని కర్ణాటక ప్రభుత్వం(Karnataka Government) విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ధర్మస్థలలో మృతదేహాలను పూడ్చినట్లు నిందితుడు చూపిన చోట్ల తవ్వకాలు చేపట్టగా ఒక పుర్రె, కొన్ని ఎముకలు తప్ప పెద్దగా ఆధారాలు లభించలేదు.
విచారణ కొనసాగుతున్న సమయంలోనే నిందితుడు భీమా మాట మార్చాడు. కొందరి ప్రోద్బలంతోనే తాను అలా చెప్పానని ప్రకటించాడు. వారు ఇచ్చిన పుర్రెనే తాను సిట్ అధికారులకు ఇచ్చానని చెప్పాడు. ఇప్పటి వరకూ తానే ప్రత్యక్ష సాక్షి అంటూ వచ్చిన భీమా మాట మార్చారు. తాను చెప్పింది అంతా అబద్ధం అన్నారు. నా చేత కొందరు అది చెప్పించారని తెలిపారు. న్యాయస్థానంలో అర్జీ కూడా కావాలని తన చేత వేయించారని…పుర్రెను ఇచ్చింది కూడా వాళ్ళేనని చెప్పారు. తాను అసలు కర్ణాటక(Karnataka)లోనే ఉండనని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో భీమాను శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు విచారించిన సిట్ చీఫ్ ప్రణబ్ మహంతి(SIT Chief Pranab Mohanty) అతడు చెప్పిందంతా అబద్ధమని తేల్చారు. భృమా మాయమాటల చెప్పి వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని అంటున్నాడని సిట్ విచారణలో గుర్తించారు. ఈ క్రమంలోనే అధికారులు భీమాను అరెస్టు చేశారు.
Dharmasthala Case | మరో పెద్ద ట్విస్ట్..
భీమా వ్యవహారంతో సందిగ్ధంలో పడిపోయిన సిట్ అధికారులకు(Sit Officers) మరో కీలక విషయం తెలిసి షాక్కు గురయ్యారు. ధర్మస్థల అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో తన కుమార్తె మిస్ అయిందంటూ వచ్చిన సుజాత భట్ కూడా ఇప్పుడు మాట మార్చారు. 2003లో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లిన తన కుమార్తె అనన్య భట్ కన్పించకుండా పోయిందని సుజాత దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాలా రోజుల క్రితం కూడా ఇలా ఫిర్యాదు చేశానని..కానీ అప్పట్లో పోలీసులు తనను పట్టించుకోలేదని చెప్పారు. దీంతో కన్నడ పోలీసులు(Kannada Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, తన కూతురు అదృశ్యమైందన్నది అబద్ధమని తాజాగా వెల్లడించిన సుజాత కొత్త ట్విస్ట్ ఇచ్చారు. తాను చెప్పినదంతా అబద్ధమని..కట్టు కథ కల్పించి చెప్పానని ఓ యూట్యూబ్ చానల్(YouTube Channel)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
తనకు అసలు కుమార్తె లేదని, ధర్మస్థల కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తనతో అలా చెప్పించారన్నారు. అనన్య ఫోటోలు కూడా సృష్టించినవే..దానికి సబంధించిన వార్తలు అన్నీ కూడా అసత్య ప్రచారమేనని తెలిపారు. “ఈ పని చేసినందుకు నేను ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. మా తాతగారి భూమిని ధర్మస్థల ఆలయ అధికారులు(Dharmasthala Temple Officers) మా అనుమతి లేకుండా తీసుకున్నారు. ఆ ఆస్తి వివాదాన్ని తేల్చుకునేందుకే వారు చెప్పినట్టు నడుచుకున్నా” అని ఆమె తెలిపారు. అయితే, తాను ఎంత పెద్ద తప్పు చేశానో తర్వాత అర్థమైందని, అందుకే ఇప్పుడు నిజం చెబుతున్నానని సుజాత భట్ అన్నారు. కర్ణాటక ప్రజలు, ధర్మస్థల భక్తులు తనను క్షమించాలని ఆమె వేడుకున్నారు.