అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ (SRSP)కు వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి జలాశయంలోకి ప్రస్తుతం 78 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది.
ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1090.7 (79.2టీఎంసీల) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వదర కొనసాగుతుండటంతో 16 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద గేట్ల (Flood Gates) ద్వారా 49,280 క్యూసెక్కులు గోదావరి (Godavari)లోకి వదులుతున్నారు.
Sriram Sagar | కాలువల ద్వారా
శ్రీరామ్సాగర్ నుంచి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్ట్ కింద లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతుండగా.. ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఎస్కేప్ గేట్ల ద్వారా 4,500 క్యూసెక్కులు, కాకతీయ ప్రధాన కాలువ (Kakatiya Canal)కు 3,500, వరద కాలువకు 20వేలు, లక్ష్మి కాలువకు 150, సరస్వతి కాలువకు 500 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. మిషన్ భగీరథకు 231క్యూసెక్కులు వదులుతుండగా, 651క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. ప్రాజెక్ట్ నుంచి 78,812 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతోంది.
Sriram Sagar | మిడ్మానేరుకు జలకళ
వరద కాలువ (Flood Canal) ద్వారా నీటి విడుదల కొనసాగతుండగటంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు (Mid Manair) జలకళను సంతరించికుంది. గత నాలుగు రోజులుగా వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు 20 వేల క్యూసెక్కులు తరలిస్తున్నారు. గాయత్రి పంప్ హౌస్ నుంచి 3,150 క్యూసెక్కులు మిడ్ మానేరులోకి ఎత్తిపోతుస్తున్నారు. దీంతో జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 25 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17 టీఎంసీలకు చేరింది.
Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి
శ్రీరామ్సాగర్ నుంచి వరద గేట్లు, కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈఈ కొత్త రవి సూచించారు. వరద పెరిగితే గోదావరిలోకి నీటి విడుదలను పెంచే అవకాశం ఉందన్నారు. నది పరీవాహక ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అలాగే వదర కాలువకు భారీగా నీటిని వదులుతుండటంతో కాలువ సమీపంలోకి వెళ్లొద్దన్నారు.
ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో చూడటానికి పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు వస్తుండటంతో ఎస్సారెస్పీ సందడిగా మారింది. అయితే అధికారులు వదర గేట్లు ఉన్న ప్రాంతంలోకి ఎవరిని అనుమించడం లేదు. దీంతో పర్యాటకులు ఆనకట్ట మీద నుంచి గోదావరి జల పరవళ్లు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఆనకట్ట దిగువన గల పార్క్లో పిల్లలతో సందడిగా గడుపుతున్నారు.