అక్షరటుడే, వెబ్డెస్క్ : Yavatmal | నిజామాబాద్ కమిషనరేట్ (Nizamabad Commissionerate) పరిధిలో జూదం పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నిర్వాహకులు మకాం మార్చేశారు. జూదరులను గ్రూప్లుగా తయారు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. జిల్లాకు సమీపంలో ఉన్న యావత్మల్లో గల పలు పేకాట క్లబ్లకు జిల్లాకు చెందిన జూదరులను తరలించి రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు.
నిజామాబాద్ నగరానికి చెందిన పేకాట నిర్వాహకులు యావత్మల్ జిల్లాలో అడ్డాలు తెరిచినట్లు సమాచారం. పఠన్ బోరీ, బోరీ, రాజూరా ప్రాంతాల్లో పలు రిక్రియేషన్ క్లబ్లను తెరిచారు. అధికారికంగా పేకాట నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేకపోయినా.. అక్కడి అధికారుల అండదండలతో జూదాలు (Gambling) నడిపిస్తున్నారు. దీంతో జిల్లాలో ఇప్పటికే జూదానికి బానిసలుగా మారిన వారు యావత్మల్ క్లబ్లకు వెళ్తున్నట్లు సమాచారం. ఇందుకోసం జిల్లాకు చెందిన నిర్వాహకులు ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చడంతో పాటు సకల రాచమర్యాదలు కల్పిస్తున్నట్లు వినికిడి. ఒక్కో టేబుల్లో రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు నడిపిస్తున్నారు.
Yavatmal | ప్రత్యేక వాహనాల్లో..
ఒక్క నిజామాబాద్ జిల్లా నుంచే నిత్యం లక్షల్లో పేకాట కోసం దారాపోస్తున్నారు. జిల్లా నుంచి నిత్యం పదుల సంఖ్యల్లో వాహనాల్లో ఈ పేకాట క్లబ్లకు తరలిస్తున్నారని సమాచారం. గతంలో జిల్లాకు సమీపంలోని ధర్మాబాద్ (Dharmabad) తదితర చోట్ల అడ్డాలు నడిపించిన నిర్వాహకులే తిరిగి యావత్మల్ ప్రాంతంలో పేకాట దందాకు తెర లేపినట్లు తెలుస్తోంది. జూదానికి బానిసలుగా మారిన వారిని ఆసరాగా చేసుకొని రోజుకు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వారి పట్ల కమిషనరేట్ పోలీసులు నిఘా ఉంచాలని పేకాటకు బానిసలుగా మారిన కుటంబ సభ్యులు కోరుతున్నారు.