అక్షరటుడే, వెబ్డెస్క్: Jio – Airtel | ఇటీవలి కాలంలో మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటే జనాలు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. రోజు రోజుకి రేట్లు పెంచేస్తుండడంతో రీఛార్జ్ చేసుకునే విషయంలో జంకుతున్నారు. ఇంట్లో ఒకటికి మించి స్మార్ట్ ఫోన్స్ ఉంటున్న క్రమంలో మొబైల్ రీఛార్జ్ (Mobile Recharge) కోసం వేలు ఖర్చు పెట్టడం భారంగా మారుతుంది.
చాలా టెలికాం కంపెనీల్లో నెలవారీగా అంటే 28 రోజుల ప్లాన్స్ దాదాపు రూ. 300 వరకు ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఇండియా టెలికాం రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ (Telecom Company Airtel) తన వినియోగదారులకు షాక్ ఇచ్చే విధంగా, ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ను ఆగస్టు 20 నుంచి నిలిపివేసింది.
Jio – Airtel | ప్లాన్ ప్రకారమే..
ఈ నిర్ణయంతో, ఇప్పటి వరకు రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్, 24 రోజుల వ్యాలిడిటీతో లభించిన రూ.249 ప్లాన్ ఇక అందుబాటులో ఉండదు. దాంతో వినియోగదారులు కనీసం రూ.319 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇటీవలే జియో JIO కూడా తన 28 రోజుల 1జీబీ/డే ప్లాన్ను తొలగించి, రూ.299 (1.5జీబీ/డే), రూ.349 (2జీబీ/డే) ప్లాన్లను మాత్రమే కొనసాగిస్తోంది. జియో (JIO) ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఎయిర్టెల్ నుండి వచ్చిన ఈ ప్రకటన యాదృచ్ఛికం కాదని, వ్యూహాత్మకమేనని పరిశీలకుల అభిప్రాయం.
వొడాఫోన్ ఐడియా (Vi) ప్రస్తుతం రూ.299కు 1జీబీ/డే ప్లాన్ అందిస్తోంది. అయితే ఇతర సంస్థల బాటలో ఇది కూడా తన ఎంట్రీ లెవెల్ ప్లాన్లను తొలగించే అవకాశం ఉందని టెలికాం రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మార్పుల వెనుక టెలికాం సంస్థల ప్రధాన ఉద్దేశ్యం వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచడమే. ప్రస్తుతం జియో వినియోగదారుల్లో 20-25 శాతం మంది, ఎయిర్టెల్ వినియోగదారుల్లో 18-20 శాతం మంది ఈ తక్కువ ధర ప్లాన్లను వాడుతున్నట్టు సమాచారం.
ఈ ప్లాన్లను నిలిపివేయడం ద్వారా కంపెనీలకు 4–7 శాతం వరకు ఆదాయవృద్ధి సాధ్యం అవుతుందని, ప్రతి వినియోగదారుని నుంచి అదనంగా రూ.10–13 వరకు లాభం పొందవచ్చని బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. ఎయిర్టెల్ తీసుకున్న ఈ నిర్ణయం టెలికాం రంగంలో వ్యయభారం పెంచే అడుగులుగా కనిపిస్తున్నాయి. వినియోగదారులపై భారం పెరిగినా, కంపెనీల ఆదాయ లక్ష్యాల పరంగా ఇది వ్యూహాత్మక చర్యగా భావించవచ్చు.