అక్షరటుడే, వెబ్డెస్క్ : Rahul Gandhi | రాజ్యాంగాన్ని రూపుమాపేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి కుట్ర పన్నాయని కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయని పునరుద్ఘాటించారు.
ఓటర్ల జాబితాలను తారుమారు చేయడం, భారత ఎన్నికల కమిషన్ (ECI)తో కుమ్మక్కై అసెంబ్లీ ఎన్నికల నుంచి లోక్సభ వరకు ఎన్నికలను బీజేపీ క్రమపద్ధతిలో దొంగిలించిందని ఆరోపించారు. బీహార్లో 16 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర ‘ఓటర్ అధికార్ యాత్ర’ను ససారాం నుంచి రాహుల్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై తీవ్ర దాడి చేశారు. “ఇది రాజ్యాంగాన్ని కాపాడటానికి జరుగుతున్న పోరాటం. మొత్తం దేశంలో RSS, BJP దానిని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి” అని ఆరోపించారు.
Rahul Gandhi | ఈసీతో కలిసి ఓట్ల చోరీ
ఎన్నికల సంఘం (Election Commission), బీజేపీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని రాహుల్గాంధీ మరోసారి ఆరోపించారు. మహారాష్ట్ర సహా పలు చోట్ల ఇలానే చేశారన్నారు. “మహారాష్ట్ర ఎన్నికల (Maharastra Elections) సందర్భంగా నిర్వహించిన సర్వేలు ఇండి కూటమి విజయం ఖాయమని వెల్లడించాయి. కానీ ఫలితం మరోలా వచ్చింది.
మేము లోక్సభ ఎన్నికలలో (Loksabha Election) మంచి సీట్లు సాధించాము. కానీ కేవలం నాలుగు నెలల తర్వాత బీజేపీ కూటమి అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించింది. ఇలా ఎందుకు జరిగిందని మేము దర్యాప్తు చేస్తే ఓట్ల చోరీ బయటపడింది. లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం కోటి కొత్త ఓటర్లను నమోదు చేసిందని తేలింది. ఈ కొత్త ఓటర్లను ఎక్కడ చేరారో అక్కడ బీజేపీ గెలిచింది” అని రాహుల్ ఆరోపించారు.
Rahul Gandhi | డిక్లరేషన్ కావాలని అడుగుతున్నారు.
తప్పులను ఎత్తి చూపిస్తే డిక్లరేషన్ ఇవ్వమంటున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. కర్ణాటకలోని (Karnataka) ఒక నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లు తారుమారు అయ్యాయని, దీని వల్ల బీజేపీ విజయం సాధించిందని రాహుల్ ఆరోపించారు. ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ వీడియో ఫుటేజ్, ఓటర్ల డేటాను కోరితే ఈసీ ఇవ్వలేదని చెప్పారు. “ఓట్ల చోరీపై మేము ప్రెజెంటేషన్ ఇచ్చాం. మరుసటి రోజే, ఈసీ నన్ను అఫిడవిట్ దాఖలు చేయమని కోరింది. అదే బీజేపీ వారు ఇలాంటి వాదనలు చేసినప్పుడు మాత్రం వారిని డిక్లరేషన్ అడగరు. ఇదేం న్యాయం“ అని గాంధీ ప్రశ్నించారు.
Rahul Gandhi | కుట్రలు బయటపెడతాం..
రానున్న బీహార్ ఎన్నికల్లోనూ (Bihar Elections) ఓట్ల చోరీ చేసేందుకు యత్నిస్తారని రాహుల్గాంధీ అన్నారు. బీహార్లో ఓట్ల దొంగతనం జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ బీజేపీ మరోసారి ఎన్నికలను దొంగిలించనివ్వబోమని ప్రతిజ్ఞ చేశారు. “ప్రధాని మోదీ నిజమైన కుల గణన నిర్వహించరని నాకు తెలుసు. కానీ మేము చేస్తాము. SIR (స్పెషల్ ఇన్స్టిట్యూషనల్ రిజిస్ట్రేషన్) కుట్రను కూడా మేము బయటపెడతాము” అని గాంధీ అన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరైన RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Rahul Gandhi | ‘బీహార్ ప్రజాస్వామ్యానికి తల్లి’: ఖర్గే
యాత్ర ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Malliarjun Kharge) మాట్లాడుతూ, “పండిట్ నెహ్రూ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ వంటి వారు మీ ఓటు హక్కు కోసం పోరాడారు. ఇప్పుడు, ఆ హక్కును ఎర్రకోట (Red fort) నుంచి సవాలు చేస్తున్నారని’ ఆరోపించారు. ‘ఓటరు అధికార్ యాత్ర’ అనేది కేవలం రాజకీయ ప్రచారం కాదు, భారతదేశ ఆత్మ కోసం పోరాటం” అని ఖర్గే అన్నారు. “ఓటు హక్కు పేదలు, అణగారిన వర్గాలకు చెందినవి, అందరికీ చెందినవి. వాటిని అధికార తారుమారు లేదా డిజిటల్ దొంగతనం ద్వారా లాక్కోలేరు” అని ఆయన స్పష్టం చేశారు.
Rahul Gandhi | ఇది దొంగతనం కాదు దోపిడీ: తేజస్వి
ఓటరు జాబితాల (Voter list) నుంచి పేర్లను తొలగించడానికి బతికున్న వారు చనిపోయినట్లు ప్రకటిస్తున్నారని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ అన్నారు. ఇది ‘ఓటు చోరీ’ (Vote Chori) కాదు – ఇది దోపిడీ. బీహార్ దీనిని అనుమతించదని మోదీ, అమిత్ షా తెలుసుకోవాలని అన్నారు.